గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (10:29 IST)

'నో వర్క్.. నో పే' విధానం.. పార్లమెంట్ ప్రతిష్టంభన అడ్డుకట్టకు అదే మంత్రదండం!

పార్లమెంట్ సభా కార్యక్రమాలకు పదేపదే అడ్డుతగిలే ఎంపీలకు కూడా నో వర్క్ .. నో పే విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా పార్లమెంట్ ప్రతిష్టంభనలకు అడ్డుకట్టవేయాలన్నది ప్రభుత్వ భావనగా ఉంది. 
 
ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాలు సమావేశాలు గత నెలలో ప్రారంభమైనప్పటికీ.. ఇప్పటివరకు ఒక్క రోజు కూడా సభా కార్యక్రమాలు సజావుగా సాగిన సందర్భాలు లేవు. ఈ ప్రతిష్టంభనకు తెరదించడానికి కేంద్రం కొత్తదారులు వెతుకుతోంది. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్న సభ్యులకు 'నో వర్క్, నో పే' విధానం అమలు చేయాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. 
 
ముఖ్యంగా లలిత్‌గేట్‌లో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధరరాజే సింధియా, వ్యాపం కుంభకోణానికి బాధ్యత వహిస్తూ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ రాజీనామా కోసం కాంగ్రెస్ సహా విపక్షాలు పట్టుబట్టడంతో రెండువారాలుగా పార్లమెంట్ సమావేశాల్లో ఎటువంటి చర్చ జరగని సంగతితెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగుతున్నది. 
 
పనిచేయని అధికారులకు నో వర్క్ నో పే సూత్రం అమలుచేస్తున్నట్లే సభా కార్యకలాపాలను అడ్డుకునే ఎంపీల వేతనాలు, ఇతర అలవెన్సుల్లో కోత విధించాలని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి మహేశ్‌శర్మ ప్రతిపాదించారు. విపక్షాల రాజీనామా డిమాండ్‌కు తలొగ్గేది లేదని స్పష్టంచేసిన అధికారపక్షం.. లలిత్‌గేట్‌పై చర్చకు మంత్రి సుష్మాస్వరాజ్ సమాధానమిస్తారని చెపుతోంది.