గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (13:00 IST)

డీఎంకే సభ్యులపై దాడి ఎందుకు జరిగింది.. అసెంబ్లీ కార్యదర్శిపై గవర్నర్ కన్నెర్ర

తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రభుత్వం ఎదుర్కొన్న విశ్వాస పరీక్ష సందర్భంగా సభలో అసలేం జరిగిందే నివేదిక రూపంలో ఇవ్వాలంటూ అసెంబ్లీ కార్యదర్శిని గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు

తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రభుత్వం ఎదుర్కొన్న విశ్వాస పరీక్ష సందర్భంగా సభలో అసలేం జరిగిందే నివేదిక రూపంలో ఇవ్వాలంటూ అసెంబ్లీ కార్యదర్శిని గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆదేశించారు. పైగా, బలపరీక్ష రోజున సభలో జరిగిన పరిణామాలపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. విపక్ష సభ్యులపై దాడి చేసి, బయటకు గెంటివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్‌ను గవర్నర్ నిలదీసినట్టు సమాచారం. ఈ పరిణామాలకు సంబంధించి వాస్తవిక అంశాలతో పూర్తి నివేదికను సమర్పించాలని గవర్నర్ ఆదేశించారు. 
 
బలపరీక్ష సందర్భంగా డీఎంకే సభ్యులు స్పీకర్ ధనపాల్‌ చొక్కా చించారు. ఆయన పోడియం వద్ద ఉన్న కుర్చీలు, టేబుళ్లు, మైకులు విరగ్గొట్టారు. తీవ్ర విధ్వంసం సృష్టించారు. సభ రెండుసార్లు వాయిదా వేశాక అసెంబ్లీ నుంచి డిఎంకే సభ్యులను మార్షల్స్ సాయంతో బయటకు గెంటివేశారు. ఆ తర్వాతే బలపరీక్ష నిర్వహించారు. అయితే సభ నుంచి చిరిగిన చొక్కాతో స్టాలిన్ బయటకు రావడంతో కలకలం రేగింది. 
 
తనపై దాడి జరిగిందంటూ ఆయన నేరుగా గవర్నర్‌ను కలిసి నిరసన తెలిపారు. తగిన చర్యలు తీసుకోకపోతే నిరాహారదీక్షకు దిగుతానని హెచ్చరించి ఆందోళనలకు దిగారు. ఈ నెల 22న తమిళనాడు అంతటా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, నిరాహార దీక్షలు చేపట్టాలని డిఎంకే తమ పార్టీ శ్రేణులకు సమాచారం కూడా పంపింది. ఈ తరుణంలో గవర్నర్ అసెంబ్లీ కార్యదర్శిని నివేదిక కోరడం ప్రాధాన్యతను సంతరించుకుంది.