గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (12:22 IST)

విశాఖ టీడీపీలో మళ్లీ ముసలం: అయ్యన్న వర్సెస్ అవంతి శ్రీనివాస్!

విశాఖపట్నం జిల్లా టీడీపీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మొన్నటికి మొన్న అధికారుల బదిలీ వ్యవహారంపై మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావులు బహిరంగంగానే విమర్శలు చేసుకున్న నేపథ్యంలో తాజాగా అయ్యన్న పాత్రుడు, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ మధ్య వివాదం నెలకొంది. 
 
మాడుగుల నియోజక వర్గంలో మంత్రి అయ్యన్నపాత్రుడు రూ.6.31 కోట్ల విలువైన భారీ ఎత్తున అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాలకు శుక్రవారం ప్రారంభించనున్నారు. స్ధానిక ఎంపీ లేకుండా ఎలా శంకుస్ధాపనలు చేస్తారంటూ ఎంపీ అవంతి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ ఎన్. యువరాజ్‌కే లేఖ ఇవ్వడంతో పాటు అడ్డుకోకపోతే సభాహక్కుల నోటీసు ఇస్తానంటూ హెచ్చరికలు చేశారు. 
 
మరోవైపు అయ్యన్నపాత్రుడి పర్యటనను చివరి నిముషం వరకు అడ్డుకోవాలని పట్టుదలతో మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గం విఫలయత్నం చేస్తోంది. దీంతో మాడుగులలో అయ్యన్న పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు మాడుగులలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు వెల్లడించారు