బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2020 (14:31 IST)

గిరిజన మహిళను ట్రాక్టర్‌‌తో తొక్కించిన కేసు : కిరాతక చర్యకు పాల్పడిన నిందితుడి అరెస్టు

గుంటూరు జిల్లాలో కిరాతక చర్యకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ జిల్లాలో ఓ గిరిజన మహిళను ట్రాక్టరుతో తొక్కించి చంపేసిన విషయం తెల్సిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఈ చర్యకు పాల్పడిన నిందితుడు శ్రీనివాస రెడ్డిని అరెస్టు చేశారు. మరోవైపు, తమకు న్యాయం చేయాలంటూ మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. 
 
కాగా, గుంటూరు జిల్లా నకరికల్లు శివాపురం తండాకు చెందిన రమావత్ మంత్రూబాయి, మంత్రూనాయక్ భార్యాభర్తలు. అటవీభూముల్లో సాగుచేసుకుంటూ ఆ భూమిలో రెండున్నర ఎకరాలపై హక్కులు పొందారు. 
 
అయితే రెండేళ్ల కిందట ఆ పొలం పనుల కోసం, ఇంటి అవసరాల నిమిత్తం నర్సింగపాడుకు చెందిన బోనముక్కల శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.3.80 లక్షలు అప్పుగా తీసుకున్నారు. కొంతకాలంగా అప్పుతీర్చాలంటూ శ్రీనివాసరెడ్డి ఒత్తిడి చేస్తున్నాడు. దీనిపై ఇరువురికి పలుమార్లు గొడవలు జరిగాయి.
 
ఈ క్రమంలో తన అప్పు తీర్చకుండా పొలంలో పనులు చేసుకునేందుకు వెళుతున్నారన్న అక్కసుతో శ్రీనివాసరెడ్డి ఘాతుకానికి పాల్పడ్డాడు. పొలానికి వెళుతున్న మంత్రూబాయి, మంత్రూనాయక్‌లను తన ట్రాక్టర్‌తో అటకాయించాడు. మాటామాటా పెరగడంతో తన ట్రాక్టర్‌తో గిరిజన మహిళ మంత్రూబాయిని తొక్కించాడు. దాంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.