కుమారులు భారంగా భావించారని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి
నవమాసాలు మోసి, కనిపెంచి పోషించిన ఇద్దరు కుమారులే కన్నతల్లిని భారంగా భావించారు. దీన్ని తట్టుకోలేని ఆ తల్లి.. వారి ముఖమైనా చూడకూడదని భావించి పక్క భవనం ఎక్కి కిందకు దూకేసి ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని సట్టుబజారులో ఈ దారుణం జరిగింది. హృదయాలను కదిలించే ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే...
సట్టుబజారుకు చెందిన కొండ్రముట్ల బసీరూన్ (57) అనే మహిళ ఉంది. ఈమె భర్త గతంలో మృతి చెందటంతో కుమారుల వద్ద ఉంటోంది. ఈమెను పోషించేందుకు, సపర్యలు చేసేందుకు ఇద్దరు కుమారులు, కోడళ్లు ఆసక్తి చూపించలేదు. తల్లిని పోషించే విషయంలో ఆమె కుమారులిద్దరూ గొడవలకు దిగుతూ ఘర్షణపడుతూ వచ్చారు.
దీన్ని చూసి తట్టుకోలేని తల్లి బసీరూన్ మనస్తాపం చెంది తన ఇంటి సమీపంలోని వేరొకరి రెండంతస్తుల భవనం ఎక్కి పైనుంచి కిందకు దూకింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.