శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 2 ఆగస్టు 2015 (12:09 IST)

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటలిక సాగవ్... ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి

పూటకో ప్రకటనతో ప్రజలను మభ్యపెడుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటలిక సాగవని కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ... పండగల పేరు చెబుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను పక్కదారి పట్టించారని ఆరోపించారు. 
 
తెరాస ప్రభుత్వానికి ఏ విషయంలోనూ ముందస్తు ప్రణాళికలు లేవని దుమ్మెత్తి పోశారు. పాలనను గాలికొదిలేసిన ప్రభుత్వం, ఉన్న నిధులను కూడా ఖర్చు చేయలేక పోతోందన్నారు. అలాగే కాకతీయ మిషన్ పేరుతో గులాబీ కార్యకర్తల జేబులు నింపారని, ఇపుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నిధులు లేవని చెపుతున్నారన్నారు. 
 
మొన్నటికిమొన్న సచివాలయాన్ని కూల్చేస్తానని, ఇప్పుడు ఉస్మానియాను కూలుస్తామని చెబుతున్న కేసీఆర్ ఆటలిక సాగవని మండిపడ్డారు. మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని, సాగర్‌ ఎడమ కాలువకు నీటి విడుదలపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి ధ్వజమెత్తారు.