గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2015 (17:01 IST)

తెలంగాణాలో సీసీఐ కేంద్రాల ద్వారా పత్తికొనుగోళ్లు : హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐ కేంద్రాల ద్వారా పత్తికొనుగోళ్ళు చేపట్టనున్నట్టు ఆ రాష్ట్ర మంత్రి టి హరీష్ రావు వెల్లడించారు. మెదక్‌ జిల్లా గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 83 సీసీఐ కేంద్రాల ద్వారా పత్తికొనుగోళ్లు ప్రారంభమైనట్లు తెలిపారు. ఎక్కడా లేని విధంగా కార్డుల ద్వారా పత్తి కొనుగోళ్లు చేపట్టి దళారి వ్యవస్థను రూపు మాపినట్లు చెప్పారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో రైతు రుణాలు రూ.28 వేల కోట్లు ఉంటే అక్కడి ప్రభుత్వం కేవలం రూ.7 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిందన్నారు. కానీ తెలంగాణలో రూ.17 వేల కోట్ల రుణాలు ఉంటే ఇప్పటికే రూ.8400 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినట్లు గుర్తు చేశారు. అక్కడ పూర్తిగా రుణమాఫీ కోసం అడగని నాయకులు ఇక్కడ ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. 
 
పాలమూరు, దిండి ప్రాజెక్టులను అడ్డుకున్న తెదేపాతో కాంగ్రెస్‌ ఎలా జతకడుతుందో కె.జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతులకు సమాధానం చెప్పాలన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.1,024 కోట్లతో 17వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంగల గోదాముల నిర్మాణం చేపట్టినట్లు హరీష్ రావు వివరించారు.