శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (21:39 IST)

ఆంధ్ర,తెలంగాణలలో వర్ష బీభత్సం... గాలులకు నేలకొరిగిన పంటపొలాలు

తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు కుదిపేశాయి. వరుసగా వానలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలను చుట్టుముడుతున్నాయి. వీటి ధాటికి రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో శుక్రవారం తెల్లవారు జాము నుంచే కురుస్తోన్న వర్షాలు రైతుకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వర్షాలకు తోడు గాలులు విపరీతంగా ఉండడంతో ఉద్యానవన రైతులకు తీరని నష్టం కలుగుతోంది. 
 
ఏపీలోని కృష్ణా, గుంటూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో కురిసిన వర్షానికి ధాన్యం, మొక్కజొన్న తదితర పంటలు తడిసి ముద్దయ్యాయి. కృష్ణాజిల్లా విజయవాడలో భారీ వర్షానికి ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడటంతో 9వ నంబరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చిత్తూరు జిల్లాలో శుక్రవారం సాయంత్రం గాలులతో కూడా వర్షం కురిసింది. దీంతో తిరుపతిలాంటి నగరాలలో చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ స్తంబాలు విరిగి పడ్డాయి. కడప, చిత్తూరు జిల్లాలలో మామిడికి తీరని నష్టం వాటిల్లింది. కాయలు రాలి కింద పడిపోయాయి. 
 
తెలంగాణలోనూ గాలివానలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రైతులు ఆందోళనకు గురయ్యారు. నల్గొండ జిల్లా ఆలేరులో ధాన్యం నీటమునిగింది. వరంగల్‌ జిల్లాలో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి తీవ్ర పంటనష్టం జరిగింది. 
 
పలు ఇళ్ల పైకప్పులు కూలాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. మధిర, కొత్తగూడెం, మణుగూరు, వెంకటాపురం, దమ్మగూడెం, చర్ల, వాజేడు, మండలాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇంకూర్‌లో భారీ వర్షం కారణంగా మిర్చి పంట తీవ్రంగా దెబ్బతింది. కొన్ని చోట్ట వరి పంట నేలకొరిగిపోయింది. వారం కిందట కురిసిన వర్షానికి కలిగిన చేదు అనుభవాలు మరచిపోకముందే మరోమారు అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి.