మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2019 (17:00 IST)

రేయ్ రారా.. నా పక్కన కూర్చో : రూరల్ సీఐని పిలిచిన ఎంపీ గోరంట్ల మాధవ్

అనంతపురం రూరల్ పరిధిలోని కొడిమి గ్రామసమీపంలో వనమహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరయ్యారు. బందోబస్తుగా అనంతపురం రూరల్ సిఐ డి.మురళీధర్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. సమావేశంలో సభ నిర్వాహకులు అతిథులును ఒక్కొక్కరుగా పిలుస్తున్నారు. 
 
అంతలోనే బిగ్గరగా ఒక అరుపు. రేయ్ రారా మురళీధర్ రెడ్డి అంటూ ఎంపీ గోరంట్ల మాధవ్ సిఐను పిలవడంతో ఒక్కసారిగా సభలో నిశ్శబ్దం ఆవహించింది. సీఐ మురళీధర్ రావడంతోనే వేదికపైనే గట్టిగా హత్తుకొని నా ప్రాణస్నేహితుడు నాకే బందోబస్తు నిర్వహించడం ఏమిటి? నా పక్కన కూర్చో అంటూ ఎంపీ మాధవ్ అతనిని హత్తుకున్నాడు.
 
ఇద్దరూ వేదికపై కూర్చొని సభా కార్యక్రమాలను నిర్వహించారు. ఎంపీ పదవి దక్కినప్పటికీ స్నేహం విలువ తెలిసిన గొప్ప వ్యక్తిగా మాధవ్‌ను కొందరు ప్రశంసలతో ముంచెత్తారు. అదేసమయంలో విధి నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విధులు నిర్వహించే మురళీ లాంటి అధికారి మన జిల్లాకు లభించడం అదృష్టమని ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. 
 
మురళి మంచి ఇంటలిజెంట్ అని, కాస్తలో ఉన్నతోద్యోగాలు తప్పిపోయినట్లు ఆయన వివరించారు. 1998లో పోస్టింగ్ లభించినప్పుడు నుండి ఇప్పటివరకు తమ స్నేహబంధం కొనసాగుతున్నదని ఎంపీ మాధవ్ పేర్కొన్నారు.