ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా చంద్రబాబుకు స్వర పరీక్ష
ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్తో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడారని భావిస్తున్న ఏసీబీ అధికారులు, చంద్రబాబు గొంతును మరోసారి పరిశీలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ కేసులో ఏసీబీ దూకుడును పెంచేసిన నేపథ్యంలో.. కీలక సాక్ష్యాలుగా పరిగణిస్తున్న ఆడియో, వీడియో టేపులు, ఫోన్ సంభాషణలపై విశ్లేషణను పూర్తి చేసిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ (ఎఫ్ఎస్ఎల్) గురువారం తుది నివేదికను ఏసీబీ కోర్టుకు సమర్పించింది.
ఇంకా సదరు నివేదిక కాపీ తమకు కావాలని గురువారమే ఏసీబీ అధికారులు కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నివేదిక కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నామని చెప్పిన ఏసీబీ అధికారులు, సదరు నివేదికతో కేసు దర్యాప్తులో వేగం పుంజుకుంటుందని తమ పిటీషన్లో కోర్టుకు చెప్పారు.
ఇకపోతే, ఈ విషయంలో చంద్రబాబుకు నేరుగా నోటీసులు జారీ చేయాలా?, లేక కోర్టు ద్వారా అనుమతి తీసుకోవాలా? అన్న విషయంపై ఏసీబీ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.