శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 14 మార్చి 2017 (16:01 IST)

భార్యను చంపి శవాన్ని మూటగట్టి కుళ్ళిన కోళ్లు పాతిపెట్టే గొయ్యిలో పూడ్చిపెట్టిన కసాయి భర్త

పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ భర్త తన భార్య పట్ల అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. ఆమెను హత్య చేయడమే కాకుండా, శవాన్ని కుళ్లిన కోళ్లు పాతిపెట్టే గొయ్యిలో పడేసి పూడ్చిపెట్టాడు. ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చ

పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ భర్త తన భార్య పట్ల అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. ఆమెను హత్య చేయడమే కాకుండా, శవాన్ని కుళ్లిన కోళ్లు పాతిపెట్టే గొయ్యిలో పడేసి పూడ్చిపెట్టాడు. ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పగో జిల్లా గోపాలపురం మండలం గంగోలు గ్రామానికి చెందిన వానుపు రాములు-నాగమణి దంపతుల కుమార్తె వెంకటలక్ష్మి (24)ని పది సంవత్సరాల క్రితం నల్లజర్లకు చెందిన రాచూరి వీర్రాజుతో వివాహం చేశారు. భార్య వెంకటలక్ష్మి బంధువుల వద్ద భర్త వీర్రాజు రూ.2 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టాడు. గత మార్చి నెల నుంచి భార్యా భర్తల మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ వివాదం కుల పెద్దల వరకు వెళ్లింది. 
 
దీంతో తీసుకున్న అప్పు జూన్‌ 30 తేదీలోపు చెల్లించి విడాకులు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. భర్తతో గొడవల నేపథ్యంలో వెంకటలక్ష్మి తన ఇద్దరు పిల్లలు తరుణ్‌కుమార్‌, ధనసాయిలతో కలిసి అదే ఊరిలో మరో ఇంట్లో నివశిస్తూ వస్తోంది. ఈ క్రమంలో గత నెల 26వ తేదీ నుంచి వెంకటలక్ష్మి కనిపించండం లేదని ఆమె తల్లిదండ్రులకు ఇరుగుపొరుగువారు సమాచారం అందించగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో స్థానిక పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, భర్త వీర్రాజుపై అనుమానించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారించగా, తన భార్యను తానే హత్య చేసినట్టు అంగీరించాడు. వెంకటలక్ష్మిని ఆమె ఉంటున్న నివాసంలోనే గత నెల 26వ తేదీ రాత్రి చెక్కతో కొట్టి హత్య చేసినట్టు చెప్పాడు. శవాన్ని మూటకట్టి బైక్‌పై చీపురుగూడెంలోని కోళ్ళ ఫారం వద్దకు తీసుకువచ్చి కుళ్లిన కోళ్ళను పాతిపెట్టే గొయ్యిలో పూడ్చిపెట్టినట్టు అంగీకరించాడు.