శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2015 (10:55 IST)

గుప్త నిధులున్నాయ్.. నిన్ను నరబలి ఇస్తా.. ఒప్పుకో.. భార్యతో భర్త

మన ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయి. వాటిని వెలికి తీసేందుకు ఓ నరబలి ఇవ్వాలి. అందుకు నిన్నే ఇస్తాను. ఇందుకు నీవు సమ్మతించాలి. ఇది తన భార్యతో భర్త చెప్పిన మాటలు. ఇందుకు ఆమె సమ్మతించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన భర్త కొడవలితో భార్య గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. భర్త నుంచి తప్పించుకునేందుకు ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వచ్చి ఆమెను కాపాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని రామగుండం పట్టణం హౌసింగ్‌ బోర్డు కాలనీలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికంగా కలకలం రేపిన ఈ దారుణం వివరాలను పరిశీలిస్తే... 
 
పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన బింగి శ్రీనివాస్‌కు ముంబైకి చెందిన రాజేశ్వరి (34) అనే మహిళతో కొన్నేళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీనివాస్‌ కొన్నేళ్లుగా ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. కుటుంబాన్ని భర్త పోషించకపోవడంతో పిల్లలను తీసుకొని రాజేశ్వరి ముంబైలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కొన్నాళ్లుగా శ్రీనివాస్‌ ఒక్కడే కాలనీలో ఉంటున్నాడు. 
 
ఈ నేపథ్యంలోతన ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయనే మూఢ నమ్మకంతో రహస్యంగా తవ్వకాలు చేపడుతూ వచ్చాడు. నిధులు లభించకపోవడంతో నరబలి ఇస్తే అవి లభిస్తాయన్న దురుద్దేశంతో నాలుగు రోజుల క్రితం భార్య రాజేశ్వరిని రామగుండానికి రప్పించాడు. 
 
బుధవారం సాయంత్రం భార్యభర్తలు భోజనం చేస్తుండగా గుప్త నిధుల విషయం లేవనెత్తాడు. నరబలి ఇస్తేనే అవి లభిస్తాయని భార్యతో చెప్పాడు. అందుకు నిన్ను బలి ఇస్తానని, దీనికి ఒప్పుకోవాలంటూ బెదిరించాడు. ఆమె నిధుల గురించి మానుకోవాలని చెప్పినా శ్రీనివాస్‌ వినకుండా ఇంట్లోని కొడవలితో భార్యపై దాడి చేసి గొంతుకోశాడు. భర్త నుంచి తప్పించుకొనేందుకు పెనుగులాడుతూ రాజేశ్వరి బిగ్గరగా కేకలు వేసింది. 
 
ఇరుగు పొరుగు వారు స్పందించి రాజేశ్వరిని కాపాడారు. ఆమెను గోదావరిఖని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రాజేశ్వరి ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, ప్రాణపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు.