గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 జులై 2017 (09:49 IST)

భార్యతో విక్రమ్ గౌడ్ విబేధాలు.. భార్య షిఫాలీకి కాల్పులకు లింకుందా..? ఆత్మహత్యాయత్నం చేశారా?

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీమంత్రి ముఖేష్‌గౌడ్‌ కుమారుడు విక్రమ్‌గౌడ్‌పై శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. ఫిలింనగర్‌ ప్రాంతంలో రోడ్‌ నంబర్‌ 86లో ముఖేష్‌గౌడ్‌ నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీమంత్రి ముఖేష్‌గౌడ్‌ కుమారుడు విక్రమ్‌గౌడ్‌పై శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. ఫిలింనగర్‌ ప్రాంతంలో రోడ్‌ నంబర్‌ 86లో ముఖేష్‌గౌడ్‌ నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. విక్రమ్ గౌడ్‌పై కాల్పుల వ్యవహారంపై ఆయన భార్య శిల్పాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
కాల్పులు జరిగిన సమయంలో తాను పిల్లలతో కలిసి పై గదిలో ఉన్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆగంతుకులు గదిలోకి వచ్చి కాల్పులు జరిపినట్టు తెలిపారు. శ్రావణ శుక్రవారం కావడంతో తామిద్దరం పూజకు వెళ్లేందుకు సిద్దమవుతుండగా ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నారు. తుపాకి చప్పుడు విని తాను కిందికి వచ్చానని, అప్పటికే విక్రమ్ రక్తపు మడుగులో కిందపడి ఉన్నారని, వెంటనే ఆస్పత్రికి తరలించానని వివరించారు. తాను, భర్త వేర్వేరుగా ఉంటున్నట్టు శిల్పాలి పేర్కొన్నారు. 
 
మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విక్రమ్ నుంచి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆయన నోరు విప్పితేనే నిజాలు బయటికి వస్తాయని వెస్ట్ జోన్ డీసీపీ చెప్పారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించిన అనంతరం టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి మాట్లాడుతూ, తెలిసిన వ్యక్తే మాట్లాడేందుకు ముందే వచ్చి.. ఘర్షణకు దిగి కాల్పులు జరిపాడా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. 
 
భార్యతో విభేదాలు ఉన్నట్టు వచ్చిన వార్తలపైనా ప్రశ్నిస్తున్నామని అన్నారు. కుటుంబంలోని విభేదాల కారణంగా విక్రమ్ గౌడ్ తనంతట తానుగా ఆత్మహత్యాయత్నం చేశాడా? అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.