డాక్టర్ల కాల్పుల ఘటన : శశికుమార్ సూసైడ్ వెనుక 'ఆ నలుగురు'
హైదరాబాద్, హిమాయతనగర్లో జరిగిన డాక్టర్ల కాల్పుల కేసు అనేక మలుపులు తిరుగుతోంది. సహచర డాక్టరుపై కాల్పులు జరిపి.. ఆపై ఆత్మహత్యకు పాల్పడిన డాక్టర్ శశికుమార్ సూసైడ్ నోట్లో మరో నలుగురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ నలుగురిలో ఓబుల్ రెడ్డి, రామారావు, కె.కె.రెడ్డి, చెన్నారెడ్డిలు ఉన్నారు. ఈ నలుగురిని శిక్షించాలంటూ శశికుమార్ సూసైడ్ నోట్లో రాశాడు. దీంతో వీరి కోసం పోలీసులు ఇపుడు గాలిస్తున్నారు.
మరోవైపు తన భర్త ఇంటి నుంచి తీసుకెళ్లిన కారు, బ్రీఫ్కేసు కనిపించడంలేదని శశికుమార్ భార్య క్రాంతి చెబుతోంది. పైగా, నా భర్త చాలా సౌమ్యుడు. తుపాకీ అంటే ఇష్టం ఉండటం వల్లనే లైసెన్స్ తీసుకున్నారు. ఆసుపత్రి భాగస్వామ్యంలో తలెత్తిన వివాదాలతో మూడు నెలలుగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఆ రోజు మిత్రులిద్దరూ ఫోన్ చేశాక బయటకు వెళ్లినట్టు చెప్పారు.
కానీ ఏదో మూలన భయం ఉండటం వల్లనే తుపాకీ కూడా తనతో తీసుకెళ్లి ఉండవచ్చు. సాయంత్రం 5.30 గంటల సమయంలో నాకు పరిచయం ఉన్న వారు ఫోన్ చేస్తే ఫైరింగ్ విషయం తెలిసింది. మంగళవారం ఉదయం తాను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. తాను ఇంటి నుంచి వెళ్లేటపుడు కారు తీసుకెళ్లారు. తన వెంట బ్రీఫ్ కేసు కూడా ఉంది. దానిలో డాక్యుమెంట్స్, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పత్రాలున్నాయి. ఇప్పటివరకూ వాటి ఆచూకీలేదు.