శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వాసుదేవన్
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (17:10 IST)

గాంధీ ఆస్పత్రిలో చనిపోయిన భాను బతికేశాడు.. ఎలా?

ఇదేదో అద్భుతం అనుకోకండి... వైద్యుల నిర్లక్ష్యం మాత్రమే. అవును... ఈ ఘనత మన హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిదే. గాంధీ ఆస్పత్రి చాలా పెద్ద పేరున్న ఆస్పత్రి. హైదరాబాద్ నగరంలోని పేద ప్రజలకు ఇదే ఆధారం. అలాంటి ఆస్పత్రి ఇపుడు ఓ గొప్పతనాన్ని మూటగట్టుకుంది. 
 
ప్రైవేట్ ఆస్పత్రుల ధనార్జనని 'ఠాగూర్' సినిమాలో చూపిస్తే... ప్రభుత్వ ఆస్పత్రుల డాక్టర్ల నిర్లక్ష్యం చాలా సినిమాలలోనే చూపించారు. అయినా... వాటి తీరు మారలేదు. అనే నిజం ఇప్పడు మరోసారి బయటపడింది. 
 
వివరాలలోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా పటాన్ చెరుకి చెందిన భాను అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం అతని కుటుంబ సభ్యులు అతడిని గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ఆ యువకుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు చనిపోయినట్లు నిర్ధారించి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సమాచారం ఇవ్వమని కుటుంబ సభ్యులకు చెప్పా.
 
పోలీసులకు సమాచారం అందించిన తర్వాతనే పోస్టుమార్టం నిర్వహిస్తామని స్పష్టంచేశారు. అయితే పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం, పోలీసులు రావడం.. వీటన్నింటికీ సమయం తీసుకోవడంతో డ్యూటీ డాక్టర్ తన టైమ్ అయిపోయిందని వెళ్లిపోయి వేరొక డాక్టర్ రావడంతో వచ్చిన డాక్టర్ భాను పరిస్థితిని గమనించి.. అతడు ఇంకా ప్రాణాలతో ఉన్నట్లు నిర్ధారించి వెంటనే చికిత్స అందించడంతో భాను ప్రాణాలతో బయటపడ్డాడు. 
 
అయితే ఈ విషయంలో పోలీసుల ఆలస్యం కూడా అతడి ప్రాణాలను కాపాడాయనే చెప్పవచ్చు. కాగా... భానుని మొదటగా పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించిన డాక్టర్ తీరు పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తగు చర్యలు తీసుకోవలసిందిగా కోరుతున్నారు.