గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 28 మార్చి 2015 (13:18 IST)

కారుతో ఐదుగుర్ని ఢీకొట్టాడు.. ఆస్పత్రిలో నుంచి పారిపోయాడు!

పేరుకు హెచ్.ఆర్ మేనేజర్.. పచ్చితాగుబోతు. పీకల వరకు మద్యం సేవించి ఐదుగుర్నీ కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆయన గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చాడు. అయితే, కేసు బలంగా ఉండటంతో ఆస్పత్రి నుంచి సిబ్బంది కళ్లుగప్పి పారిపోయాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. 
 
హైదరాబాద్ శివారు ప్రాంతమైన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్యప్రదేశ్, భోపాల్ సమీపంలోని సాగర్ గ్రామానికి చెందిన సోనీరాం చందానీ (36), హరీష్ ప్రసాద్ (40) ప్రేమ వివాహం చేసుకుని మాదాపూర్‌లోని విఠల్ రావు నగర్‌లో ఉంటున్నారు. భార్య, తనయుడు మోక్ష (4)లతో కలిసి హరీష్ ప్రసాద్ నానక్ రాం గూడ నుంచి గచ్చిబౌలి వైపు ఔటర్ రింగ్ రోడ్డుపై వస్తూ, సిగ్నల్ పడడంతో గచ్చిబౌలి దగ్గర ఆగారు. ఇంతలో వెనుకగా వచ్చిన స్కోడా (టీఎస్09ఈసీ9599) కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో ఎగిరిపడ్డ ప్రసాద్ కుటుంబాన్ని గుద్దుకుంటూ ముందున్న హోండా సిటీ, ఇన్నోవా కార్లను ఢీ కొట్టింది.
 
దీంతో సోనీరాం, మోక్ష, ప్రసాద్‌లతో, హోండా సిటీలో ఉన్న ఓ మహిళ, పురుషుడు, స్కోడా కారులోని శ్వేతాబ్ కుమార్, వినోద్, రిషబ్, శ్రీవాత్సవ గాయపడ్డారు. వారిని స్థానికులు హిమగిరి ఆసుపత్రికి తరలించారు. సోనీరాం కాసేపటికే మృతి చెందగా, ప్రసాద్, మోక్ష తీవ్రగాయాలపాలయ్యారు. స్వల్పగాయాలపాలైన హోండా సిటీలో వారు చికిత్స చేయించుకుని ఇళ్లకు వెళ్లారు. ఇంతలో అందర్నీ స్కోడా కారుతో ఢీ కొట్టిన శ్వేతాబ్ కుమార్ (డెలాయిట్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్) కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పారిపోయాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.