బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 27 మే 2018 (14:22 IST)

అనుమానంతో భార్యను చంపేసి దుబాయ్ పారిపోయిన భర్త...

ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ... భార్యపై ఉన్న చిన్నపాటి అనుమానం మాత్రం పోలేదు. దీనికితోడు తల్లి, సోదరులు, ఇతరులు చెప్పిన మరికొన్ని మాటలు ఆ అనుమానాన్ని మరింతగా పెచ్చాయి.

ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ... భార్యపై ఉన్న చిన్నపాటి అనుమానం మాత్రం పోలేదు. దీనికితోడు తల్లి, సోదరులు, ఇతరులు చెప్పిన మరికొన్ని మాటలు ఆ అనుమానాన్ని మరింతగా పెచ్చాయి. అంతే.. వేల కిలోమీటర్ల దూరం నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి కట్టుకున్న భార్యను హత్య చేసి, ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ దుబాయ్‌కు వెళ్లిపోయాడు. దీనిపై హైదరాబాద్ పోలీసులు కూపీ లాగడంతో అసలు విషయం బహిర్గతమైంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, డబీర్‌పుర ప్రాంతానికి చెందిన అక్బర్ అలీఖాన్ (30) అలియాస్ హైదర్‌కు కింగ్‌కోఠిలోని పర్ధాగేట్‌కు చెందిన జీబనాజ్‌తో పదేండ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం. కొన్ని సంవత్సరాల తర్వాత దంపతుల మధ్య పలుమార్లు వివాదాలు తలెత్తాయి. దీంతో జీబనాజ్ తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్బర్ అలీఖాన్ ఉద్యోగ నిమిత్తం సౌదికి వెళ్లిపోయాడు. 
 
అప్పటి నుంచి అక్బర్ తల్లి మెహబూబ్‌ ఉన్నీసా.. కోడలు జీబనాజ్‌పై కొడుకుకు చెడుగా చెప్పడం ప్రారంభించింది. అలాగే అతని కుటుంబ సభ్యులు సైతం జీబనాజ్‌పై చెడుగా చెప్పసాగారు. దీంతో అక్బర్ మానసికంగా కృంగిపోయాడు. దీంతో అక్బర్‌ఖాన్ ఈ నెల 17న నగరానికి వచ్చాడు. 18న మధ్యాహ్నం 2 గంటల సమయంలో అత్తారింటికి వెళ్లాడు. 
 
రంజాన్ మాసం సందర్భంగా పేదలకు జకాత్ చేద్దామని చెప్పి భార్యను బైక్‌పై తీసుకెళ్లాడు. అక్కడి నుంచి నేరుగా డబీర్‌పురలోని తన ఇంటికి వెళ్లి పలు అంశాలపై చర్చించుకున్నారు. అ సమయంలో సహనం కోల్పోయిన అక్బర్‌ఖాన్ సమీపంలోని సుత్తెతో జీబనాజ్ తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహానికి పలు బట్టలు, ఇతర కాగితాల్లో ప్యాక్ బాక్స్‌లా మార్చేశాడు.
 
తెలిసిన ఆటోలో మృతదేహాన్ని డబీర్‌పుర ఏడు గుళ్ల ప్రాంతానికి తరలించాడు. అప్పటికే అక్బర్ తిరిగి దుబాయ్‌కు వెళ్లడానికి.. ఉస్మాన్‌అలీఖాన్, ఖైసర్ అలీఖాన్, ఇమ్రాన్‌అలీఖాన్‌లు విమాన టికెట్‌ను సిద్ధం చేశారు. డబీర్‌పురలో మృతదేహాన్ని వదిలేసిన అక్బర్ నేరుగా ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకుని.. తిరిగి అదే ఆటోలో విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి సౌదికి పారిపోయాడు. 
 
కాగా.. స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా జరిగిన విషయం చెప్పాడు. హత్యకు ప్రేరేపించిన అలీఖాన్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.