'కార్డన్సెర్చ్' పేరిట విస్తృత తనిఖీలు... 50 మంది అనుమానితుల అరెస్టు...!
హైదరాబాద్లోని ఉప్పల్ చిలుకానగర్లో పోలీసులు బుధవారం రాత్రి కార్డన్సెర్చ్ ఆపరేషన్ పేరుతో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా నాలుగు వందల మంది పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంట్లో గాలింపు చర్యలు చేపట్టారు. మల్కాజ్గిరి డీసీపీ రమారాజేశ్వరి నేతృత్వంలో చేపట్టిన విస్తృత తనిఖీలు బుధవారం రాత్రి నుంచి గురువారం వేకువజాము వరకు జరిపారు.
ఈ తనిఖీల్లో పోలీసులు 50 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 13 మంది పాతనేరస్థులుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఎక్కువమంది ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్ వంటి ఉత్తరాధి రాష్ట్రాలకు చెందిన వారు అని పోలీసులు వెల్లడించారు.
ఈ తనిఖీలలో భాగంగా పోలీసులు ఆధారాలు లేని 40 వాహనాలను, 9 గ్యాస్ సిలిండర్లతోపాటు గ్యాస్ కట్టర్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా గత ఆదివారం అమీర్పేట పరిధిలో పోలీసులు జరిపిన తనిఖీలలో 110 మంది అనుమానితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.