గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 29 జూన్ 2018 (11:05 IST)

అమ్మను చంపేసిన కసాయి.. రాడ్డుతో కొట్టి.. గుండెలపై కూర్చొని పీక నొక్కి...

నవ మాసాలు మోసి.. కని పెంచిన అమ్మనే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. అదీకూడా అత్యంత క్రూరంగా. తలపై ఇనుప రాడ్‌తో కొట్టి.. గుండెలపై కూర్చొని పీక నొక్కి ఊపిరాడకుండా చేసి హత్యచేశాడు. అనంతరం తానే స్వయంగా పోలీసులు

నవ మాసాలు మోసి.. కని పెంచిన అమ్మనే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. అదీకూడా అత్యంత క్రూరంగా. తలపై ఇనుప రాడ్‌తో కొట్టి.. గుండెలపై కూర్చొని పీక నొక్కి ఊపిరాడకుండా చేసి హత్యచేశాడు. అనంతరం తానే స్వయంగా పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ఈ దారుణం హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన ఎల్లారెడ్డి గూడలో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఎల్లారెడ్డిగూడ అంబేద్కర్‌ నగర్‌ వీకేఆర్‌ అపార్ట్‌మెంట్‌లో గొంటి చౌదరి శ్రీనివాస్‌ యాదవ్‌, మమత అనే దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు మదన్‌ శ్రీకర్‌ ఇంటర్‌ పూర్తిచేసి అల్లర చిల్లరగా తిరుగుతున్నాడు. పెద్ద కుమార్తె వివాహం యేడాది క్రితం జరగ్గా, మరో కుమార్తె చదువుకుంటోంది. వీరికు పలు అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల ద్వారా వచ్చే అద్దెలతో కుటుంబ జీవనం సాఫీగా సాగుతోంది.
 
ఇలా సాఫీగా సాగిపోతున్న వీరి కుటుంబాన్ని చిట్టీల వ్యాపారం కష్టాలుపాల్జేసింది. ఇందులో నష్టాలు రావడంతో లక్షల రూపాయలు చిట్టీ పాడుకున్న వారికి బాకీ పడింది. వారు ఇంటి వద్దకు వచ్చి తరచూ గొడవ చేసేవారు. దీంతో ఇంట్లో గొడవలు జరిగేవి. 15 రోజుల క్రితం నిద్రమాత్రలు మింగి మమత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రాణాలతో బయటపడిన ఆమె కొత్తపేటలో ఉంటున్న సోదరుడు రమేష్‌ ఇంటికెళ్లింది. అప్పటి నుంచి మదన్‌ శ్రీకర్‌ తల్లిపై ద్వేషం పెంచుకున్నాడు. పైగా, అమ్మ వల్ల తమ కుటుంబ పరువు పోతుందని భావించాడు. దీన్ని అవమానంగా ఫీలయ్యాడు.
 
ఈ నేపథ్యంలో మమత తన సోదరుడితో కలిసి ఇంటికి వచ్చింది. ఈ విషయం మదన్‌కు తెలిసింది. అప్పటికే తన స్నేహితుల బర్త్‌డే పార్టీలో ఉన్న మదన్... అక్కడే పీకల వరకు మద్యం సేవించాడు. ఆ తర్వాత నేరుగా ఇంటికి వచ్చి.. తల్లితో మాట్లాడాలని చెప్పి ఇంట్లో నుంచి టెర్రస్‌పైకి తీసుకెళ్లాడు. కుటుంబం పరువు తీస్తున్నావంటూ మండిపడుతూ ఐరన్ రాడ్‌తో తల మీద బలంగా కొట్టాడు. దీంతో రక్తస్రావం కావడంతో మమత కొన ఊపిరితో కిందపడిపోయింది. అప్పటికీ ఆ కిరాతకుడుకి ఆగ్రహం చల్లారలేదు. తల్లి గుండెల మీద కూర్చున్న మదన్‌ గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. 
 
అనంతరం తానే హత్య చేసినట్టు పోలీసులకు, పెళ్లి వేడుకల్లో ఉన్న తండ్రికి ఫోన్‌ చేసి చెప్పాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా మమత అప్పటికే మృతి చెందింది. క్లూస్‌ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. తండ్రి, బంధువులు రాగా తల్లిని తానే చంపేసానంటూ గర్వంగా చెప్పాడు. దీనిపై కేసు నమోదు చేసి మదన్‌ను అరెస్టు చేశారు.