గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 25 మే 2015 (06:23 IST)

మీరు కాదంటే.. కర్ణాటకకు వెళ్లినోణ్ణి..! ప్రత్యేక హోదా నన్ను ఎందుకు అడుగుతారు? : వెంకయ్య

తెలుగు రాష్ర్టాల ప్రజలు తనను కాదన్నారనే కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్లానని, అలాంటప్పుడు  ప్రత్యేక హోదాపై తననెందుకు ప్రశ్నిస్తారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఎదురు ప్రశ్నించారు. తనను అడగడం భావ్యం కాదని తన అసంతృప్తిని సున్నితంగా వెల్లగక్కారు. తాను ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే మంత్రిని కాదని, అన్ని రాష్ర్టాలకూ మంత్రిని అని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా తనకు అన్ని రాష్ర్టాలు సమానమేనని పేర్కొన్నారు.. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు. 
 
యూపీఏ చేసిన తప్పు వల్లే తమ ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే ప్రత్యేక హోదా సాధించలేకపోయామని వివరించారు. ప్రత్యేక హోదా పొందే అంశాలేవీ ఏపీకి లేవని, లోటుబడ్జెట్‌ అన్న ఒక్క అంశమే ప్రత్యేక హోదా అడగటానికి కారణంగా ఉందని వెంకయ్య పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 11 రాష్ర్టాలు ప్రత్యేక హోదా కోరుతున్నాయని, ఏపీ లోటు బడ్జెట్‌ను పూరించేందుకు జాతీయ స్థాయిలో కృషి చేశానని చెప్పారు.
 
నవ్యాంధ్ర రాజధాని కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ స్థాయిలో ల్యాండ్‌ పూలింగ్‌ చేపట్టడం అభినందనీయమన్నారు. టీడీపీ, బీజేపీ మైత్రి కొనసాగుతుందని భావిస్తున్నానని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై తనకు ఇంకా నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్‌ బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయని విలేకరులు వెంకయ్యను ప్రశ్నించగా, అందులో తప్పేముందని బదులిచ్చారు.