బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 6 మార్చి 2015 (14:37 IST)

రైతుల భూములపై పవన్... కళ్యాణ్ మాటను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదా...?!!

గుంటూరులోని ఉండవల్లితో సహా మరో మూడు గ్రామాల రైతుల భూములను వదిలేసి మిగిలిన చోట్ల రాజధాని నిర్మాణాన్ని సాగించాలంటూ పవన్ కళ్యాణ్ శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఐతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మాటలకు పెద్ద విలువ ఇచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. గతంలో కొందరు రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి తమకు భూములు ఇవ్వడం ఇష్టం లేదనీ, ఇలా ఇవ్వడం వల్ల తమ ఆధారం పోతుందని ఏకరవు పెట్టుకున్నారు. 
 
ఐతే రాజధాని నిర్మాణంలో రైతులు ఇష్టమున్నా లేకున్నా భూములను ఇవ్వక తప్పదని అప్పట్లో చంద్రబాబు చెప్పినట్లు ప్రచారం కూడా జరిగింది. అదలావుంచితే ఇపుడు ఏపీ రాజధాని కోసం సుమారు 32 వేల ఎకరాలకు పైగా భూ సేకరణ పూర్తి అయ్యింది. ఈ నేపధ్యంలో ఇపుడు వచ్చి అభ్యంతరాలు చెప్పినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
 
రాజధాని నిర్మాణం విషయంలో ముందుకు వెళ్లడమే కానీ వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి లేదని తెలుస్తోంది. భూములను అప్పగించకుండా మొండికేస్తున్న రైతులపై భూసేకరణ చట్టం ప్రయోగించాలని కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరి ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి స్టెప్పు తీసుకుంటారో...? లేదంటే నేరుగా ఆయన చెప్పినట్లుగానే ఆమరణ దీక్షకు కూర్చుంటారో వెయిట్ అండ్ సీ.