నేను టీడీపీతో సంప్రదింపులు జరపలేదు... వైసీపీని వీడే ప్రసక్తే లేదు...ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ
తాను ఏ ఇతర పార్టీ నాయకులతోనూ చర్చలు జరపలేదనీ, అవన్ని అభూత కల్పనలు మాత్రమేనని, వైఎస్ఆర్సీపీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే సుజయ్కృష్ణ రంగారావు స్పష్టం చేశారు. ఆ పార్టీకి నష్టం కలిగించే పని ఎప్పుడూ చేయనని ఆయన స్పష్టం చేశారు.
మంగళవారం విజయనగరం జిల్లా వైఎస్ఆర్ సీపీ నేతలతో కలసి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. అనంతరం సుజయ్కృష్ణ మీడియాతో మాట్లాడుతూ, పార్టీ బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్టు చెప్పారు. తాను టీడీపీ నేతలతో ఎప్పుడూ సంప్రదింపులు జరపలేదని వెల్లడించారు.
తాను పార్టీ మారబోతున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని అన్నారు. పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ సీపీలో చేరినపుడు వ్యక్తిగత కారణాల వల్ల హాజరుకాలేకపోయానని సుజయ్కృష్ణ తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో సెక్షన్ 30 అమలుపై వైఎస్ జగన్తో చర్చించినట్టు ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి చెప్పారు.