తాటిపై దాడికి నిరసన : అశ్వారావు పేట బంద్ సక్సెస్!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై దాడికి నిరసనగా శుక్రవారం చేపట్టిన అశ్వారావుపేట బంద్ విజయవంతమైంది. ఈ బంద్కు పలు పార్టీలు, ప్రజాసంఘాలు సంఘీభావం ప్రకటించాయి. అశ్వారావుపేట జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించాయి. ఏలూరు ఎం పీ మాగంటి బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.
పినపాక, పాలేరు, ఇల్లెందు, వైరా, కొత్తగూడెం నియోజకవర్గాల్లోనూ ఆందోళనలు మిన్నంటాయి. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఈ ర్యాలీలో వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకు లు పెద్దఎత్తున పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ముంపు మండలాల్లోని గిరిజనులు, ఆదివాసీలంటే టీడీపీకి చులకనగా ఉందన్నారు.
ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే శ్రీనివాసరావు అనుచరులు దాడి చేయడాన్ని ఖండించారు.
పార్టీ తెలంగాణ రాష్ట్ర శాసనసభాపక్ష నాయకుడు, గిరిజన ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై టీడీపీ ఎంపీ మాగంటి బాబు, ఆయన అనుచరులు దాడి చేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. వెంటనే మాగంటి బాబును, ఆయన అనుచరులను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అరెస్టు చేయాలని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యుడు గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు.