శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 6 ఏప్రియల్ 2016 (15:49 IST)

గొలుసు దొంగలు కాదా? అమ్మే ఆ పసికందును చంపేసిందా?

హైదరాబాదులో గొలుసు దొంగల దాడిలో గాయపడి చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. మల్కాజ్‌గిరి పరిధిలోని నేరేడుమెట్‌ ఆర్కేపురంలో జరిగిన ఈ పసికందు మృతిపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఆర్కేపురంకు చెందిన పూర్ణిమ మంగళవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో తన 25 రోజుల కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఇంటి నుంచి బయల్దేరింది. 
 
మార్గమధ్యంలో ఎదురుగా బైక్ పైన వచ్చిన ఇద్దరు గొలుసు దొంగలు పూర్ణిమపై స్ప్రే చల్లి మెడలో ఉన్న బంగారు గొలుసు తెంపారు. పూర్ణిమ ప్రతిఘటించడంతో పెనుగులాట జరిగింది. దొంగలు దాడిచేసి గొలుసు లాక్కెళ్లారు. ఈ ఘటనలో పూర్ణిమ చంకలో ఉన్న పసికందు గొంతుకు తీవ్రగాయామైంది. ఘటన నుంచి తేరుకున్న పూర్ణిమ భర్త శ్రీధర్‌తో కలిసి పసికందును తార్నాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
 
అక్కడ చికిత్స పొందుతూ పసికందు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, 25 రోజుల పసికందును తల్లే హత్య చేసిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపైన కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై మండిపడుతున్నారు. 
 
పసికందు తల్లి పూర్ణిమ చెప్పిన చెప్పిన వివరాలపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఇంటిని తనిఖీ చేయడంతో రక్తపు మరకలున్న దుస్తులు కనిపించాయి. దీంతో దంపతులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.