శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 20 డిశెంబరు 2014 (13:30 IST)

అసెంబ్లీ : 'బాబు వస్తారు.. జాబు వస్తుంది' అని జగన్ అనగానే మైక్ కట్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా శనివారం ఉదయం విపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ... "బాబు వస్తారు... జాబ్ వస్తుంది..." అంటుండగానే స్పీకర్ కోడెల ఆయన మైక్‌ను కట్ చేశారు. 
 
శనివారం నాటి సభలో వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలంటూ వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో జగన్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆయన ప్రసంగిస్తూ, అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. 
 
ఐకేపీ, అంగన్ వాడీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విషయాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా, ఎన్నికల సమయంలో తెలుగుదేశం ఇచ్చిన హామీలను ప్రస్తావించబోతే స్పీకర్ అడ్డుకోవడం గమనార్హం. 
 
స్పీకర్ వ్యవహారశైలిపై విపక్ష సభ్యులు మండిపడుతున్నారు. కోడెల శివప్రసాద్ సభాపతిగా కాకుండా, టీడీపీ సభ్యుడిగా నడుచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే స్పీకర్‌పై సభా హక్కుల నోటీసు ఇస్తామని వారు హెచ్చరించారు.