గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (15:55 IST)

చంద్రబాబు ఒక్క నిజం చెప్పినా తల వెయ్యి ముక్కలవుతుంది : జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక ముని శాపం పెట్టాడని, దాని ప్రకారం నిజం చెబితే బాబు తల వెయ్యి ముక్కలవుతుందని వైకాపా అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సోమవారం అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ అంశంలో జరుగుతున్న చర్చలో భాగంగా చంద్రబాబు ప్రసంగించిన తర్వాత జగన్ మాట్లాడుతూ, బాబు నోటి నుంచి ఒక్క నిజం కూడా రాదని, ఆయనకు ఓ ముని శాపం ఉందని ఎద్దేవా చేశారు. తేదేపాకు దమ్ముంటే తక్షణం ఎన్నికలకు రావాలని జగన్ సవాలు విసిరారు. 
 
అంతేకాకుండా, చంద్రబాబు కళ్లార్పకుండా అబద్ధాలాడుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబులాగా అబద్ధాలాడే వ్యక్తిని తానెప్పుడూ చూడలేదన్నారు. అసలు, రుణమాఫీలో రైతులకిస్తున్నదెంత? తదితర విషయాలు చెప్పాలని అడిగితే సమాధానం లేకపోతే ఎలాగంటూ ఆయన ఆసహనం వ్యక్తం చేశారు. కేస్ స్టడీలంటే అర్థం తెలియవారికి ఏం చెప్పేదంటూ జగన్ విస్మయం వ్యక్తం చేశారు. 
 
అంతకుముందు రుణమాఫీ, రైతుల ఆత్మహత్యలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ వాడివేడిగా జరిగింది. రైతుల ఆత్మహత్యల అంశంలో చెప్పిన అంశాలకు కట్టుబడి ఉంటే నిరూపించాలని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ప్రతిపక్షాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే వైఎస్ఆర్ సీపీ ప్రతిపక్ష హోదా నుంచి తప్పుకోవాలని ఆయన సవాల్ విసిశారు.
 
దీనిపై ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీటుగా స్పందించారు. 'యావత్ టీడీపీ పార్టీకే.. సవాల్ విసురుతున్నా... ఇప్పుడు ఎన్నికలకు వెళ్దాం, అందుకు సిద్దమేనా' అని ప్రతి సవాల్ విసిరారు.