గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2019 (08:32 IST)

మూడేళ్లలో జమిలి ఎన్నికలు: చంద్రబాబు

రివర్స్ టెండరింగ్​ మాదిరిగానే రివర్స్ ఎన్నికలు వస్తే బాగుండని ప్రజలు కోరుకుంటున్నారని, రివర్స్ ఎన్నికలు సంగతేమోగాని మూడేళ్లలో జమిలి ఎన్నికలు వస్తాయని తెదేపా అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

అవినీతి చేశారు...గత ప్రభుత్వం అంతా అవినీతిమయం అని రాద్ధాంతం చేసిన వైకాపా ప్రభుత్వానికి తనపై అవినీతి ఇంకా దొరకలేదా అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్...తనపై అవినీతిని నిరూపించలేకపోయారని మంత్రుల్ని కోప్పడే పరిస్థితి ఉందన్నారు.

తెలుగుదేశం పార్టీ న్యాయ విభాగం ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం భరించటానికి సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ ఇంత అనాగరిక పరిస్థితులు లేవని ఆయన ఆరోపించారు.

రాక్షసులు ఊళ్లపై పడి ఇష్టానుసారం ప్రవర్తించేవాళ్ళని చరిత్రలో చదువుకున్నామన్న చంద్రబాబు...వైకాపా ప్రభుత్వం రాక్షసుల్ని మైమరిపించే విధంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా కార్యకర్తలు, నేతలపై అక్రమంగా 565 కేసులు పెట్టారన్నారు.

గతంలో తెదేపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు... న్యాయ విభాగం అండగా నిలబడిందన్నారు. పరిటాల రవిని పార్టీ భవనంలోనే హత్య చేసినా... వందలాది తెదేపా కార్యకర్తలను హతమార్చినా... భయపడకుండా ప్రభుత్వ అరాచకాలపై పోరాడారని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్ళీ అంతకుమించిన అరాచకాలు జరుగుతున్నాయని.. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతికి నిర్మించాలని భావిస్తే... పురిట్లోనే అమరావతిని చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

అవినీతిలో చిక్కుకుని ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి తనపై ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. గతంలోనూ తనపై 26 కేసులు వేసి ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారన్నారు.