శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (14:46 IST)

పెట్రోల్ పోసి తగులబెట్టుకున్నా ఏపీకి ప్రత్యేక హోదా రాదు: జేసీ దివాకర్ రెడ్డి

పెట్రోల్ పోసి తగులబెట్టుకున్నా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తేల్చి చెప్పేశారు. వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా మారిన జేసీ మరోసారి మీడియా ముందుకొచ్చి ప్రత్యేక హోదాపై మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న దీక్షలపై జేసీ వంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ దీక్షలను ఆయన ఓ జిమ్మిక్కేనని తేల్చేశారు. అయినా దీక్షలకు మహాత్మా గాంధీతోనే కాలం చెల్లిపోయిందని కూడా జేసీ వ్యాఖ్యానించారు. 
 
అంతేగాకుండా.. ‘‘జగన్ దీక్ష వృథా. మంత్రాలకు చింతకాయలు రాలవు. దీక్ష చేస్తే పోలీసులు ఎత్తుకెళ్లి ఇంజక్షన్లు ఎక్కిస్తారు. పెట్రోల్ పోసీ తగులబెట్టుకున్నా ఏపీకి ప్రత్యేక హోదా రాదు’’ అని జేసీ వెల్లడించారు. అధికార టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 
 
ఏపీ వర్షాకాల సమావేశాల్లో చంద్రబాబు - జగన్‌ల మధ్య మాటల యుద్ధం సాగుతుండటంపై జేసీ స్పందిస్తూ చంద్రబాబుకు కోపం, ఆవేశం తక్కువని, ఆ విషయంలో చంద్రబాబుతో పోలిస్తే జగన్ ఎంతో ముందు నిలిచాడని చెప్పారు. అందువల్లే తాను కొన్ని విషయాల్లో జగన్‌ను సమర్థించాల్సి వస్తోందన్నారు. 
 
ఇకపోతే ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రానేరాదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో పాటు.. ఏపీ మంత్రులు, ఎంపీలంతా రాజీనామా చేసినా రాష్ట్రానికి హోదా రాదని తేల్చిపారేశారు. ఒకవేళ జగన్ హోదా తీసుకు రాగలిగితే తాను రాజీనామా చేస్తానని అన్నారు. హోదా రాదు గానీ, ఓ మంచి ప్యాకేజీ వచ్చే అవకాశాలు ఉన్నాయని, బీహార్‌కు ఇచ్చిన నిధుల కన్నా ఎక్కువగా నిధులు ఏపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.