శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 20 జూన్ 2018 (22:51 IST)

‘సాక్షర భారత్ మిషన్’ కేంద్రం నిలిపివేసింది... 19 వేల మందికి గౌరవ వేతనం నిల్

అమరావతి: సాక్షర భారత్ మిషన్ కార్యక్రమాన్ని నిలిపివేసింది కేంద్రప్రభుత్వమని, ఆ కారణంగా 19,336 మంది గౌరవ వేతనం నష్టపోతారని ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు తెలిపారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లా

అమరావతి: సాక్షర భారత్ మిషన్ కార్యక్రమాన్ని నిలిపివేసింది కేంద్రప్రభుత్వమని, ఆ కారణంగా 19,336 మంది గౌరవ వేతనం నష్టపోతారని ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు తెలిపారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలోని వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయని, అది నిజం కాదని ఆయన వివరణ ఇచ్చారు. సాక్షర భారత్ మిషన్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ పథకమని, అది 2009లో ప్రారంభమైందని చెప్పారు. 
 
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నిష్పత్తి 60:40గా ఉంటుందని తెలిపారు. కేంద్రం ఈ పథకాన్ని 2016లో, 17లో నిలిపివేస్తున్నట్లు చెబుతూ ఆ రెండేళ్లూ పొడిగిస్తూ వచ్చిందన్నారు. చివరకు ఈ ఏడాది మార్చిలో దీనిని నిలిపివేశారని చెప్పారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 18,862 మంది గ్రామ కోఆర్డినేటర్లు, 494 మంది మండల కోఆర్డినేటర్లు పని చేస్తున్నారన్నారు. గ్రామ కోఆర్డినేటర్‌కు నెలకు రూ.2,000, మండల కోఆర్డినేటర్ కు రూ.6,000 గౌరవవేతనం ఇచ్చినట్లు వివరించారు.
 
ఈ కార్యక్రమం స్థానంలో పడో-పడావో కార్యక్రమం చేపట్టడానికి కేంద్రం రంగం సిద్ధం చేసిందన్నారు. ఈ కార్యక్రమాన్ని నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వమని, అయితే బీజేపీ నేతలు విష్ణు కుమార్ రాజు, విష్ణువర్ధన రెడ్డిలు 21 వేల మందిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించినట్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కేంద్రం ఈ కార్యక్రమాన్ని నిలిపివేయడం ద్వారా మధ్యప్రదేశ్ లో గత అక్టోబర్ లో 20వేల మందిని, గుజరాత్ లో 22వేల మందిని, రాజస్థానంలో 20వేల మందిని, చత్తీస్ గడ్ లో కూడా వేల మందిని తొలగించారని, దేశం మొత్తం మీద లక్ష మంది వరకు తొలగించారని వివరించారు. రాష్ట్ర అక్షరాశ్యత మిషన్ అథారిటీ వద్ద ఉన్న రూ.3.35 కోట్లు, రూ.54.92 లక్షలను తిరిగి ఇచ్చివేయాలని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ అక్షరాశ్యత మిషన్ అథారిటీ ఆదేశించిందన్నారు.
 
రాష్ట్రంలోని వాలంటీర్లను తొలగించకుండా కొనసాగించేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు సార్లు కేంద్రానికి విజ్ఙప్తి చేస్తూ లేఖలు రాసినట్లు తెలిపారు. దీనిపై కేంద్రమే ఒక నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు. వారిని వాలంటీర్లుగా తొలగించకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుందని,  ముఖ్యమంత్రి ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్నారని జూపూడి చెప్పారు.