శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2016 (10:41 IST)

ఇంట్లో తండ్రి శవం.. ల్యాబ్‌లో ప్రాక్టికల్స్.. కన్నీటితోనే పరీక్ష రాసిన విద్యార్థి...

ఇంట్లో శవాన్ని పెట్టుకుని... ల్యాబ్‌లో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరయ్యాడో విద్యార్థి. ఈ విద్యార్థిని చూసిన ఇతరులు కూడా అయ్యోపాపం అంటూ కన్నీరుకార్చారు. కన్నతండ్రి చనిపోవడంతో కళ్ళ నుంచి ధారగా కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూనే ప్రాక్టికల్స్ పరీక్ష రాశాడో విద్యార్థి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... కడప జిల్లా వేంపల్లె దళితవాడకు చెందిన మద్ది సుబ్బరాయుడికి (50) భార్య భవాని, కుమారులు లక్ష్మీనారాయణ, నారాయణస్వామి, కుమార్తెలు నాగలక్ష్మి, స్ఫూర్తి అనే పిల్లలు ఉన్నారు. రెండో కుమారుడు నారాయణస్వామి చదువుల కోసం ఆ కుటుంబమంతా శ్రమిస్తోంది. 
 
నారాయణస్వామి వేంపల్లి జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. తెల్లారితే ఇంటర్ ప్రాక్టికల్‌ పరీక్ష అనగా, మంగళవారం రాత్రి సుబ్బరాయుడు గుండెపోటుతో మరణించాడు. ఈ వార్త విన్న నారాయణ స్వామికి కూడా గుండె ఆగిపోయినంత పని అయింది. 
 
దీంతో పరీక్షకు వెళ్లడం ఎలాగని మథనపడ్డాడు. అయితే, బంధువులు, కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహించి, ధైర్య వరచనాలు చెప్పి.. నారాయణ స్వామిని పరీక్షా హాలుకు తీసుకెళ్లారు. అక్కడ తండ్రి ఇకలేడన్న విషయాన్ని దిగమింగి.. కన్నీరు కార్చుతూనే పరీక్ష రాశాడు. నారాయణ స్వామి ఇంటికి వచ్చాక అంత్యక్రియలు పూర్తి చేశారు.