విజయవాడ కృష్ణా నది ఒడ్డున దుర్గమ్మ సన్నిధిలో కార్తీక దీపాలు...
శివోహం...శివోహం... కేశవా...మాధవా... అంటూ సంకీర్తనలు. కార్తీక పౌర్ణమి నాడు...శివకేశవుల నామస్మరణం, భక్త జన ఘోషతో మార్మోగుతున్న పుణ్య తీర్థాలు. కృష్ణా నది ఒడ్డున భక్తుల పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. దుర్గమ్మ సన్నిధిలో కార్తీక దీపం వెలిగిస్తున్నారు. కార్తీక దీపం వెలిగింది... పౌర్ణమి వరాలు కురిపిస్తోంది... ఎక్కడ చూసినా శివకేశవుల నామ స్మరణే... కార్తీక పౌర్ణమి సందర్భంగా పుణ్య తీర్థాలన్నీ కిటకిటలాడుతున్నాయి. నదీతీరంలో సమద్రంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. విశిష్ఠమైన ఈ పౌర్ణమి నాడు ఉపావాస దీక్ష, శివార్చన చేస్తే, పుణ్య ఫలమని భక్తుల నమ్మిక.
విజయవాడలోని దుర్గగుడి వద్ద కృష్ణా నదిలో వేలాదిమంది పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. శివుడికి ప్రీతిపాత్రమైనది అభిషేకం. అదేవిధంగా నదీమ తల్లి ఒడ్డున భక్తులు నీటిలో మునిగి సరిగంగ స్నానాలు ఆచరిస్తున్నారు. విజయవాడలో దుర్గా ఘాట్లో భక్తులకు జల్లు స్నాన ఘట్టాలు ఏర్పాటు చేశారు. నదిలో స్నానం ఆచరించలేని వారు ఇక్కడ తల స్నానం చేస్తున్నారు. ఇది కూడా శివార్ధమే. మన నడి నెత్తిన జలధార పడుతుంటే... శివుడికి అభిషేకం చేసినట్లు... మనలోని షడ్చక్రాలు అభిషిక్తం అవుతాయి.
భక్తులు పుణ్య స్నానాల అనంతరం కృష్ణ ఒడ్డున రావి చెట్టు కింద కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. శివాలయంలో, దుర్గమ్మ సన్నిధిలో భక్తులు దీపారాధన చేస్తున్నారు. మరో పక్క శివాలయాలలో మహా లింగాభిషేకాలు నిర్వహిస్తున్నారు. శివుడికి ప్రీతిపాత్రమైనది అభిషేకంతో పౌర్ణమి నాడు వరాలు పొందాలని జనం భక్తి సాగరంలో మునిగితేలుతున్నారు.