గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 2 జులై 2015 (06:30 IST)

కేసీఆర్....! నిన్ను తరిమికొట్టేలా చేస్తా... అదే నా లక్ష్యం.... రేవంత్ రెడ్డి

కేసీఆర్‌ను, కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయాల నుంచి తరిమికొట్టేలా ప్రజలను చైతన్యపరుస్తానని, ప్రతి యువకుడిని భుజం తట్టి లేపుతానని రేవంత్ రెడ్డి ప్రతిన బూనారు. కేసీఆర్‌ను గద్దె దింపడమే తన ఏకైక లక్ష్యమని ఆయన శపథం చేశారు. 
 
చర్లపల్లి జైలు నుంచి బుధవారం సాయంత్రం విడుదలైన తర్వాత ఆయన టిడిపి కార్యకర్తలను, తన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. కెసిఆర్‌పై ఆ వ్యాఖ్యలు చేశారు. రెండు పెగ్గులేస్తే కానీ లేవలేని సన్నాసి ఉద్యమాన్ని నడిపాడని అంటున్నారు. అంతేకాదు, తెలంగాణ జాతిపిత అని కూడా అంటున్నారు. ఈ సన్నాసి ఉద్యమం చేస్తే ఆ సన్నాసులు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.తాగుబోతు ఎక్కడైనా జాతిపిత అయితాడా? అని రేవంత్ ప్రశ్నించారు.  
 
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై పాస్ పోర్టు కుంభకోణం కేసులు ఉన్నాయని అన్నారు. అప్పట్లో పోలీసులెక్కడ పట్టుకెళ్లిపోతారోనని ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ ఇంట్లో దాక్కున్నాడని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తనపై కుట్రపూరితంగా కేసు పెట్టిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాంగాన్నంతా తనపైనే ప్రయోగించి ఈ కేసులో ఇరికించారని ఆయన విమర్శించారు. కేసీఆర్ కుటుంబాన్ని కూడా తెలంగాణ ప్రజలు రాజకీయ సమాధి చేస్తారని రేవంత్ హెచ్చరించారు.