దేశంలోనే కేసీఆరే నెం.1 సీఎం అట: కేటీఆర్, ఈటెలపై తేనెటీగల దాడి!
తెలంగాణ సీఎం కేసీఆర్ దేశంలోనే నెం.1 ముఖ్యమంత్రి అని ఆ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ను తెగ పొగిడేశారు. దేశంలోనే కేసీఆర్ నెంబర్ వన్ సీఎం అని కితాబిచ్చారు.
అకాల వర్షాలకు కుదేలైన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రులు జూపల్లి కృష్ణారావు, జగదీశ్ రెడ్డి చెప్పారు. బుధవారం వారు వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను మంత్రులు పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, కల్వకుంట్ల తారక రామారావుల పైన తేనెటీగలు దాడి చేశాయి. కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల మండలం నర్సింగాపూర్లో వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల పరిశీలనకు బుధవారం నాడు మంత్రులు కేటీఆర్, ఈటెల, ఎమ్మెల్యేలు పుట్టా మధు, గంగుల కమలాకర్, విద్యాసాగర్ రావు వచ్చారు. ఈ సందర్భంగా వర్షాలకు దెబ్బతిన్న మామిడితోటను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో వారు అక్కడి నుంచి పరుగులు తీశారు.