గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (11:31 IST)

చంద్రబాబుకు కేసీఆర్ సలహా : మీ ఆఫీసు వాస్తు సరిగాలేదు!

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు వాస్తుపై అపార నమ్మకం. అలాగే, చంద్రబాబు కూడా ఎక్కువగానే ఉంది. వీరిద్దరు చేసే ప్రతి పనికీ వాస్తు దోషాలను విధిగా చూసుకున్న తర్వాతే ముందడుగు వేస్తారు.
 
అయితే, వాస్తు విషయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కంటే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మరింత పట్టుంది. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇరువురు నేతలు గవర్నర్ సమక్షంలో దాదాపు గంటకు పైగా ముచ్చటించుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్, చంద్రబాబుకు ఓ హెచ్చరిక చేసినట్లు తెలిసింది. 
 
‘మీ కార్యాలయం వాస్తు బాగా లేదు, త్వరలో వాస్తు దోషాలను సరిచేసుకోండి’ అంటూ కేసీఆర్, చంద్రబాబుకు సూచించారట. రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయంలోని ఎల్ బ్లాకులో చంద్రబాబు కార్యాలయం ఏర్పాటైంది. తొలుత సౌత్ హెచ్ బ్లాకును కేటాయించినా, వాస్తు బాగా లేదన్న కారణంగా, చంద్రబాబు తన కార్యాలయాన్ని ఎల్ బ్లాకులో ఏర్పాటు చేసుకున్నారు. 
 
చంద్రబాబు కార్యాలయం కోసం ఏపీ సర్కారు దాదాపు రూ.20 కోట్లను ఖర్చు చేసింది కూడా. తాజాగా కేసీఆర్ హెచ్చరికతో సందిగ్ధంలో పడ్డ చంద్రబాబు, తన కార్యాలయం వాస్తుపై మరోసారి పరిశీలన చేయించాలని అనుచరగణానికి ఆదేశాలు జారీ చేశారట.