శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 23 మే 2015 (15:40 IST)

కర్నూలులో కేఈ మండిపాటు : జగన్ ఖల్ నాయక్.. సోనియా రాక్షసి

ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత జగన్‌పై ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నాయకుడు కాదని ఆయన ఖల్ నాయక్ అని కేఈ విమర్శించారు. మంగళగిరిలో వచ్చే నెల 3,4 తేదీల్లో జగన్ చేయనున్నది సమర దీక్ష కాదు రాక్షస దీక్ష అని ఉపముఖ్యమంత్రి మండిపడ్డారు. సమైక్య రాష్ట్రాన్ని విభజించిన రాక్షసి సోనియా అని ఆయన ధ్వజమెత్తారు.
 
కర్నూలు జిల్లా టీడీపీ కొత్త అధ్యక్షుడిగా శిల్పా చక్రపాణి రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆయన మరోమారు తన అక్కసును వెళ్ళగక్కారు. కర్నూలు జిల్లాపై చంద్రబాబు సరిగా దృష్టిసారించడం లేదనీ, ఆయన ధ్యాసంతా పశ్చిమ గోదావరి జిల్లాపైనే ఉందంటూ వ్యాఖ్యానించారు. బాబు చూపంతా ఎప్పుడూ పశ్చిమగోదావరి జిల్లాపైనేనని, కర్నూలుపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. అలాగని కర్నూలులో 3 సీట్లే గెలవడంలో తమ తప్పు లేదన్నారు. 
 
ఇకపోతే.. జిల్లా టీడీపీ కొత్త అధ్యక్షుడు... జిల్లాలో ఏ వీధి ఎక్కడ ఉందో కూడా తెలియదన్నారు. చాలా శ్రమ పడాల్సి ఉందని జిల్లా పార్టీ కొత్త అధ్యక్షుడికి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా అధ్యక్షుడు మార్పు చాలా సాహసవంతమైన చర్య అన్నారు. చంద్రబాబుపై అసంతృప్తిని వెళ్లగక్కడం కేఈ కృష్ణమూర్తికి కొత్త కాదు. ఏపీ నూతన రాజధాని ఏర్పాటుపై చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని కేఈ మొదట్లోనే వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.