మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Eswar
Last Modified: శుక్రవారం, 25 జులై 2014 (15:00 IST)

అమ్మ కేరళ కుట్టీలు... దిమ్మతిరిగే దొంగతనాలు... విమానాల్లో ప్రయాణాలు..

కేవలం దొంగతనాల కోసమే కేరళ టు బెజవాడ ట్రావెల్ చేస్తూ పని కాగానే పత్తా లేకుండా పోయే ఇద్దరు కేరళ మహిళా కిలాడీలను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగలించిన బంగారాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో పోలీసులు అలెర్ట్ కావటంతో ఇద్దరు కేరళ కుట్టీల జాతకం వెలుగు చూసింది. ఏకంగా ఫ్లైట్ జర్నీ చేసి మరీ బెజవాడలో దొంగతనాలు చేస్తున్నారు ఈ కేరళ కుట్టీలు. 
 
బెజవాడలోని ప్రధాన రద్దీప్రదేశాలు, శుభకార్యాలు జరిగే ఫంక్షన్ హాళ్ళు, బడా హోటల్స్ లో ఈ ముద్దుగుమ్మలు చేతివాటం ప్రదర్శించారు. దొంగనతం చేసిన వెంటనే నగదును జేబులో వేసుకొని బంగారం, ఇతర విలువయిన ఆభరణాలను సిమెంట్ సంచుల్లో ప్యాక్ చేసి రైల్వే పార్శిల్ కేరళకు పంపిస్తారు. పంపించిన మరుసటి రోజు విమానంలో కేరళ చేరుకుని రైల్వే స్టేషన్‌లో రెడీగా ఉన్న పార్శిల్‌ను పికప్ చేసుకుంటారు. ఇదీ వీరి రోబరీ స్టైల్.
 
సంధర్బానికి తగ్గట్లుగా కట్టుబొట్లులను మర్చేసి సీన్‌లో సింక్ అయిపోతారు. డబ్బున్న వారి పెళ్ళిళ్ళు జరుగుతుంటే అదే స్టైల్‌లో మండపంలోకి ఎంట్రీ ఇవ్వటంలో ఈ ఇద్దరు మహిళలు ఆరితేరిపోయారు. ఇలాంటి సంఘటనలు విజయవాడలో ఎక్కువగా జరుగుతుండటంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా... బెజవాడలో దొంగతనం చేసి కేరళ వెళ్ళటానికి ఖర్చులకు డబ్బులు లేకపోవటంతో బెజవాడలోని బంగారు దుకాణాల్లో దొంగలించిన ఆభరణాలు అమ్మేందుకు యత్నించి పోలీసులకు చిక్కిపోయారు.
 
కేరళ మహిళల చేతివాటం చూసిన పోలీసులకు కళ్ళు బైర్లు కమ్మాయి. తమదైన స్టైల్ లో ఇంటరాగేషన్ చేయటంతో వ్యవహారం బయటకు వచ్చింది. నిందితులను అరెస్ట్ చేసి 6.75లక్షల రూపాయలు విలువయిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.