శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 15 నవంబరు 2017 (20:43 IST)

బోటు ప్రమాద ఘటన... మరో ఏడుగురిపై వేటు... మంత్రి అఖిలప్రియ

అమరావతి : విజయవాడలోని కృష్ణా నదిలో చోటుచేసుకున్న బోటు ప్రమాదానికి బాధ్యులుగా గుర్తిస్తూ మరో ఏడుగురు ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ప్రకటించారు. బోటు ప్రమాదంలో ఇంకెవరి పాత్ర ఉన్నా వారిపైనా కఠిన చర్యలు

అమరావతి : విజయవాడలోని కృష్ణా నదిలో చోటుచేసుకున్న బోటు ప్రమాదానికి బాధ్యులుగా గుర్తిస్తూ మరో ఏడుగురు ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ప్రకటించారు. బోటు ప్రమాదంలో ఇంకెవరి పాత్ర ఉన్నా వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి అఖిలప్రియ మాట్లాడారు.
 
ఈ నెల 12న చోటుచేసుకున్న బోటు ప్రమాదంపై ఇప్పటికే బోటు డ్రైవర్ శ్రీనివాసరావును సస్పెండ్ చేశామన్నారు. దర్యాప్తులో మరో ఏడుగురు ఉద్యోగులు బాధ్యతారాహిత్యంగా వ్యహరించినట్లు గుర్తించామన్నారు. వారిని కూడా విధుల నుంచి తొలగిస్తూ, ఆదేశాలు జారీ చేశామన్నారు. విధుల నుంచి తొలగించిన వారిలో జి.రామకృష్ణ(అసిస్టెంట్ జనరల్ మేనేజర్ - రెగ్యులర్), వీవీఎస్ గంగరాజు (డిప్యూటీ మేనేజర్ – రెగ్యులర్), పి.వీరారెడ్డి(గజఈతగాడు – కాంట్రాక్టు ఉద్యోగి), కొల్లి శ్రీధర్(అసిస్టెంట్ మేనేజర్ – కాంట్రాక్టు ఉద్యోగి), పి.నరసింహరావు(బోటు డ్రైవర్ – ఔట్ సోర్సింగ్ ఉద్యోగి), కె. చమ్‌చమ్ రాజు(బోటు డ్రైవర్ – ఔట్ సోర్సింగ్ ఉద్యోగి), ఎ.శ్రీనివాసరావు(బోటు డ్రైవర్ – ఔట్ సోర్సింగ్ ఉద్యోగి) ఉన్నారని మంత్రి తెలిపారు. 
 
తాము శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని, అదేసమయంలో పోలీసులు కూడా దర్యాప్తు పూర్తయిన తరవాత చట్టపరమైన చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. ఇప్పటికే బోటు యజమాని కొండలరావు పోలీసుల అదుపులో ఉన్నాడన్నారు. ఈ ప్రమాదంలో ఇంకెవరి పాత్ర ఉన్నట్లు వెల్లడైనా వారిపైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశించారన్నారు.