కృష్ణా జలాల పంపిణీ వివాదంపై మీ వైఖరేంటి : కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న
కృష్ణా జలాల పంపిణీ వివాదంపై మీ వైఖరేంటని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. బ్రిజేష్కుమార్ తుది, మధ్యంతర తీర్పు అమలు నిలిపివేయాలని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిటిషన్ వేసింది. దీనిపై బుధవారం వాదనలు జరుగగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున వైద్యనాథన్ హాజరై వాదనలు వినిపించారు.
ఇరు వర్గాల వాదనలు ఆలకించిన సుప్రీంకోర్టు... కృష్ణా జలాల వివాదంపై కేంద్రం వైఖరి చెప్పాలని స్పష్టం చేసింది. అదేసమయంలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటి వాటాలోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. తెలంగాణ పిటిషన్పై కేంద్రానికి నోటీసులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ట్రిబ్యునల్లో ఖాళీ అయిన సభ్యుడి స్థానాన్ని భర్తీ చేయాలని సూచిస్తూ.. తదుపరి విచారణను వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది.