గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2015 (08:03 IST)

జగన్, కేటీఆర్ కలయిక... సీఎం రమేష్ విన్నపం

వారి విషయంలో పార్టీల నాయకులందరూ సానుకూలంగానే వ్యవహరించారు. భేషజాలను పక్కన పెట్టి తెలుగుదేశం నేత సీఎం రమేష్, వైసీపీ నేత జగన్‌ను విన్నవించడం... ఆయన తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడడం అన్నీ జరిగిపోయాయి. విద్యుత్ ఉద్యోగుల విషయంలో జరిగిన సంఘటనలో ఫలితం ఏమొచ్చింది.?  వివరాలిలా ఉన్నాయి. 
 
సీమాంధ్ర మూలాల పేరిట తెలంగాణ సర్కారు 1250 విద్యుత్‌ ఉద్యోగులను రిలీవ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అత్యంత కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ను విద్యుత్‌ ఉద్యోగులు కొందరు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దానిపై స్పందించిన సీఎం రమేశ్‌... వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌తో ఈ అంశంపై ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి విద్యుత్‌ ఉద్యోగులకు వేతనాలు ఇప్పించాలని జగన్‌ను కోరారు. 
 
దానికి జగన్‌ సమ్మతించడంతో విద్యుత్‌ ఉద్యోగులు పలువురు ఆయనను కలిశారట. జగన్‌ ఈ విషయంపై మంత్రి కేటీఆర్‌తో మాట్లాడారు. బదిలీ అయిన ఉద్యోగులకు వేతనాలు ఇప్పించాలని కోరారు. ఆ మేరకు లేఖ కూడా రాశారు. అనంతరం విద్యుత్‌ ఉద్యోగులు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కలిసి తమ కష్టాలు చెప్పుకొన్నారు.  కేటీఆర్‌ దీనిపై స్పందించి, తెలంగాణ విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలతో మాట్లాడారు. ‘బదిలీ అయిన ఉద్యోగులు జీతాల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ల ఉసురు మనకెందుకు! జీతాలు ఇవ్వండని కోరారు. ఆ అంశం ఆయన పరిధిలో ఉందని అధికారులు స్పష్టం చేశారు. దీంతో కేటీఆర్‌ కూడా తన నిస్సహాయత వ్యక్తం చేసినట్టు తెలిసింది.