శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (09:54 IST)

కేవీపీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేసిన టీడీపీ

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ బంధువు కేవీపీ రామచంద్రరావుపై టీడీపీ సభా హక్కుల నోటీసు జారీ చేసింది. అసెంబ్లీ ప్రాంగణం నుంచి తొలగించిన రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని యథాస్థానంలో ఉంచాలంటూ కేవీపీ ఇటీవలే స్పీకర్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో స్పీకర్‌తో పాటు సభను కించపరిచేలా కేవీపీ వ్యాఖ్యలు చేశారని ఏపీ అసెంబ్లీలో అధికార టీడీపీ ఆరోపిస్తూ శుక్రవారం ఉదయం స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు నోటీసు ఇచ్చింది. 
 
ఈ ఆరోపణలపై స్పందించిన కేవీపీ, గురువారం స్పీకర్‌కు మరో లేఖ రాశారు. తానెవరినీ కించపరచలేదని, అసలు అలాంటి ఉద్దేశమే తనకు లేదని నిన్నటి లేఖలో కేవీపీ వివరణ ఇచ్చారు. ఆ లేఖను పరిగణనలోకి తీసుకోని టీడీపీ శుక్రవారంనాటి సమావేశాల్లో భాగంగా కేవీపీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేసింది. కేవీపీపై చర్యలు తీసుకోవాల్సిందేనని నోటీసులో టీడీపీ స్పీకర్‌ను కోరింది.