అక్కడ అంగుళం భూమి కోసం రగడ... ఏపీలో భూ యజమానులను కూలింగ్లో పెట్టి పూలింగ్...
దేశంలో ఎక్కడైనా భూసేకరణ భారీ వివాదాలకు, ఉద్యమాలు... రక్తపాతాలకు దారితీస్తుంది. కానీ, ఏపీలో మాత్రం అది వెరీ సింపుల్. భూ యజమానులను కూలింగ్లో పెట్టి... పూలింగ్ అంటూ వేల ఎకరాలు చిటికెలో సమీకరించి పడేస్తారు. అదీ... చంద్రబాబు మార్క్ పూలింగ్ టెక్నిక్.
ఇలాగే అమరావతికి 33 వేల ఎకరాలు రైతుల నుంచి పూలింగ్ విధానంలో సమీకరించి... దేశంలోనే ఏపీ సిఎం రికార్డ్ సృష్టించారు. ఇపుడు అదే టెక్నిక్ను విజయవాడ... గన్నవరం విమానాశ్రయం కోసం స్టార్ట్ చేశారు. 11 గ్రామాలు పరిధిలో 1224 ఎకరాల సేకరణకు చర్యలు ప్రారంభించారు.
గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు వెబ్ దునియాకు వెల్లడించారు.
అమరావతిలో ఇస్తున్న ప్యాకేజీనే గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూములు ఇస్తున్న రైతులకు ఇస్తున్నామని తెలిపారు. 43.22 ఎకరాలు ఇప్పటికే పూలింగ్లో వచ్చిందని, మరో 2,3 రోజుల్లో మిగిలిన భూములు పూలింగ్లో రైతులు ఇస్తారని చెపుతున్నారు జాయింట్ కలెక్టర్.
రైతుల సహకారంతో పూర్తి స్థాయిలో భూములను పూలింగ్లో తీసుకుంటున్నాం. జరీబు, మెట్ట అన్న తేడా లేకుండా పరిహారం ఇస్తున్నామని, కృష్ణంరాజు అనే ఒక్క రైతు 32 ఎకరాలు ఇస్తున్నారని తెలిపారు. భూమి లేని కుటుంబాలకు కూడా పరిహారం ఇస్తున్నామని, 926 మంది రైతులలో 476 మంది రైతులు తమ భూములు ఇచ్చారని జాయింట్ కలెక్టర్ చెప్పారు.