గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 16 జూన్ 2016 (12:49 IST)

శాంతి పూజలు చేయమంటే ప్రసాదంలో మత్తుమందు పెట్టి... రూ.1.3 కోట్లు దోచుకున్న దొంగబాబా

మానసిక ప్రశాంతత కరువైందని, అందుకు పూజలు చేసి ఉపశమనం కలిగించాలని కోరిన ఓ వ్యాపారి కుటుంబాన్ని పూజారిగా వచ్చిన దొంగబాబా కుచ్చుటోపీ పెట్టాడు.

మానసిక ప్రశాంతత కరువైందని, అందుకు పూజలు చేసి ఉపశమనం కలిగించాలని కోరిన ఓ వ్యాపారి కుటుంబాన్ని పూజారిగా వచ్చిన దొంగబాబా కుచ్చుటోపీ పెట్టాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహల్స్‌లో వెలుగులోకి వచ్చింది. సినీ ఫక్కీలో ప్రసాదంలో మత్తుమందు కలిపి ఇచ్చిన ఆ దొంగబాబా వ్యాపారి ఇంట్లోంచి ఏకంగా రూ.1.3 కోట్ల నగదు, నగలు దొంగిలించి పరారయ్యాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే బంజారాహిల్స్‌లో రోడ్డు నెం.12లో నివాసముండే లైఫ్‌స్టైల్ బిల్డింగ్ యజమాని మధుసూదన్‌ రెడ్డి కుటుంబ సభ్యులు ఇటీవలి కాలంలో తరచుగా అనారోగ్యం పాలు కావడంతోపాటు ఇతర సమస్యలతో వారికి మానసిక ప్రశాంతత కరువైంది. దీంతో కొందరు బాబాలు, స్వామీజీలను సంప్రదిస్తే.. ఇంట్లో శాంతి పూజలు నిర్వహిస్తే సరిపోతుందని సలహా ఇచ్చారు. 
 
దీంతో కర్ణాటకకు చెందిన ఓ బాబాను హైదరాబాద్‌కు పిలిపించి... బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. బుధవారం ఉదయం పూజ తంతు నిర్వహించాడు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పూజ కొనసాగింది. ఈ సందర్భంగా ఇంట్లో ఉన్న నగదు అంతా తెచ్చి పూజ వద్ద ఉంచాలని బాబా సూచించాడు. వారు వెంటనే ఇంట్లో ఉన్న రూ.1.3 కోట్ల నగదు, నగలను తెచ్చి పూజ జరిగే ప్రదేశంలో పెట్టారు. పూజ అనంతరం అందరికీ బాబా ప్రసాదం పంచి పెట్టాడు. ప్రసాదంలో మత్తుమందు కలిపి ఉండటంతో అది ఆరగించిన ముగ్గురు కుటుంబ సభ్యులు స్పృహ కోల్పోయారు. 
 
దాదాపు రెండు గంటల అనంతరం మధుసూదన్‌ రెడ్డి కొడుకు లేచి చూసే సరికి బాబాతోపాటు అక్కడ ఉంచిన నగదు కూడా కన్పించలేదు. ముందుగా అపస్మారకస్థితిలో ఉన్న తల్లిదండ్రులను ఆయన హుటాహుటిన అపోలో దవాఖానకు తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మధుసూదన్ రెడ్డి నివాసంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.