శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 11 జులై 2019 (08:16 IST)

ఇంతలోనే అంత అప్పా? .. బుగ్గనపై లోకేష్ ఆగ్రహం

టీడీపీ ప్రభుత్వం రాష్ర్రాన్ని అప్పులపాలు చేసిపోయిందంటూ ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన విడుదల చేసిన శ్వేతపత్రం పై మాజీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తీరుపై ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు.

"ఆర్థికమంత్రిగారూ! మీరు శ్వేతపత్రాలు అన్నప్పుడే సాక్షి కథనాల్లా స్పష్టత లేకుండా, ఆధారాలు లేకుండా ఉంటాయని మేము ఊహించాం. వృద్ధి కాగితాల మీద కనిపించింది కానీ ఫీల్డులో కనిపించడం లేదు అన్నారు. అంటే మీ శ్వేతపత్రంలో ఉంది కానీ మీరు ఒప్పుకోనంటారు అంతేగా? 
 
మత్స్యశాఖ, పశుసంవర్థక శాఖల అభివృద్ధిని వ్యవసాయశాఖ అభివృద్ధిలో ఎలా చూపిస్తారని అడిగారు. ముందుగా ఆ శాఖల అభివృద్ధిని మీరు ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. అయితే వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్యశాఖలను కలిపే జీఎస్ డిపిని లెక్కించడం దేశమంతా ఉంది. మీకది కొత్త విషయం అంతే. 
 
2018-19 నాటి బడ్జెట్ ప్రకారం రాష్ట్ర అప్పు రూ. 2 లక్షల 49 వేల కోట్లు. కేంద్ర ఆర్థిక మంత్రి కూడా వారం క్రితం పార్లమెంటులో ఇదే చెప్పారు. మీరేమో 3 లక్షల 62 వేల కోట్లని అన్నారు. ఒకేసారి లక్ష 13 వేల కోట్ల అప్పు ఎలా పెరిగింది? ఈ 45 రోజుల్లో మీ ప్రభుత్వమేమైనా చేసిందా? 
 
అప్పు ఎక్కువ చూపించి మీరేం చెప్పదలచుకున్నారు? రాష్ట్ర పరిస్థితి తెలియకుండానే మీరు అన్ని హామీలు చేశారా? వాటిని నెరవేర్చకుండా  తప్పించుకోడానికి ఇప్పుడు అప్పుల బూచిని బూతద్దంలో చూపిస్తే కుదరదు. చాతకాదంటే ప్రజల ముందు ఒప్పుకోండి"  అని ఆగ్రహం వ్యక్తంచేశారు.