శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (10:57 IST)

ఒంగోలు అమ్మాయి.. గుంటూరు అబ్బాయి.. ఆత్మహత్య చేసుకున్నారు.. ఎందుకని?

తిరుపతిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన జె.శశి (24) బీటెక్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఇతడికి ఒంగోలుకు చెందిన కానిస్టేబుల్‌ బాబు కుమార్తె స్టెర్లా మేరీ (22)తో రెండేళ్ల కిందట పరిచయమైంది. అది ప్రేమగా మారింది. ఈ విషయం పెద్దల దృష్టికి వెళ్లింది. స్టెర్లా మేరీతో వివాహానికి శశి తల్లిదండ్రులు అంగీకరించలేదు. 
 
దీంతో మనస్తాపానికి గురైన వీరు వారం రోజులుగా ఆందోళన చెందారు. చివరకు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని రెండు రోజుల కిందట తిరుపతికి చేరుకున్నారు. తమ వివాహానికి పెద్దలను ఒప్పించేందుకు శశి ఇక్కడ్నుంచీ ప్రయత్నించిందీ కూడా. దీనికి ఆ పోలీసు కానిస్టేబుల్ ససేమిరా అన్నట్టు సమాచారం. ఇక విడిపోయి జీవించడం కంటే... కలిసి చనిపోదామని ఆ ప్రేమికులు నిర్ణయించుకున్నారు. 
 
అంతే తిరుపతి- పాకాల రైలు మార్గంలోని మహిళా పాలిటెక్నిక్‌ వద్దకెళ్లారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అటుగా వెళ్తున్న పాదచారుల సమాచారంతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శశి మృతదేహం పక్కన దొరికిన సెల్‌ఫోను ఆధారంగా మృతుల కుటుంబీకులకు సమాచారమిచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.