మాచర్లలో ప్రేమజంట ఆత్మహత్య... కారణం అదే...
వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలిగొన్న సంఘటన గుంటూరు జిల్లాలోని మాచర్ల పట్టణంలో శనివారం నాడు వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే... మాచర్లకు చెందిన 30 ఏళ్ల మక్కెన శ్రీనివాసరావు బాపట్ల మండలం జమ్ములపాలెం గ్రామంలో విద్యుత్ శాఖలో అసిస్టెంట్ లైన్మన్గా ఉన్నాడు. వినుకొండలోని కొండ్రముట్ల గ్రామానికి చెందిన శశిరేఖ అనే మహిళను వివాహం చేసుకుని, గత కొంతకాలంగా మనస్పర్థలు రావడంతో ఆమెకు దూరంగా ఉంటున్నాడు.
ఈ క్రమంలో బాపట్ల మండలానికి చెందిన ఝాన్సీ అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇంతలో ఏమైందో ఏమోకానీ మాచర్లలో ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఆత్మహత్య శుక్రవారంనాడే జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.