చలి పులి పంజా...! వణికిపోతున్న ఏజెన్సీ వాసులు...!
కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుతో ఏజెన్సీ వాసులు గడ గడ వణికిపోతున్నారు. చింతపల్లి మండలం లంబసింగి, పాడేరు మండలంమినుములూరుతోపాటు మిగతా ప్రాంతాల ప్రజలు చలితో నరకయాతన అనుభవిస్తున్నారు.
రాష్ట్ర శివారులోని పర్యాటక ప్రాంతం లంబసింగిలో సున్నా, పాడేరు ఘాట్లోని పోతురాజుస్వామి గుడి వద్ద ఒక డిగ్రీ, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 3 డిగ్రీలు, మినుములూరు కేంద్ర కాఫీబోర్డు, అనంతగిరి, అరకుల్లో 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ ప్రాంతాల్లో ఉదయం 10 గంటలు దాటాకే సూర్యుడు కనిపిస్తున్నాడు. సముద్ర మట్టానికి ఎత్తయిన ప్రదేశం కావడంతో ఏజెన్సీలో ఈ పరిస్థితి అని, జనవరిలో చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డి.శేఖర్ వెల్లడించారు.
ప్రస్తుతం ఇక్కడ ప్రజలు, వాహన చోదకులు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చలి తట్టుకోలేక చలి మంటలతో ఉపశనం పొందుతున్నారు. కాగా చలి మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.