శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2017 (11:15 IST)

విచారణలో కొట్టకుండా ఉండేందుకు సీఐడీ అధికారులకు రూ.కోటి ఎర...!

బోధన్‌ వాణిజ్యపన్నుల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన సునీల్‌ సీఐడీ అధికారులకు కోటి రూపాయలు ఎర వేశాడు. ఈ కేసు విచారణ పేరుతో తనను అరెక్టు చేశాక వేధించకుండా ఉండేందుకు, ఎట్టిపరిస్థితుల్లోనూ ఒంటిపై ఒక్క

బోధన్‌ వాణిజ్యపన్నుల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన సునీల్‌ సీఐడీ అధికారులకు కోటి రూపాయలు ఎర వేశాడు. ఈ కేసు విచారణ పేరుతో తనను అరెక్టు చేశాక వేధించకుండా ఉండేందుకు, ఎట్టిపరిస్థితుల్లోనూ ఒంటిపై ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా ఉండేందుకు ఈ మొత్తాన్ని ఆశజూపాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బోధన్‌ వాణిజ్యపన్నుల విభాగంలో భారీగా నిధులు గోల్‌మాల్ జరిగాయి. దీనిపై విచారణకు రంగంలోకి దిగిన సీఐడీ అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. దీంతో ఈ స్కామ్‌కు ప్రధాన సూత్రధారిగా ఉండే సునీల్‌ను అరెస్టు చేశారు. ఆయన అరెస్టుతో విస్తుగొలిపే వాస్తవాలెన్నో వెలుగులోకి వస్తున్నాయి. గడచిన మూడేళ్ళ కాలంలోనే నకిలీ పత్రాలతో దాదాపు రూ.70 కోట్లు కొల్లగొట్టిన సునీల్‌ అధికారులను ప్రలోభపెట్టడంలో ఆరితేరినట్టు తేల్చారు. 
 
ఆయనతో ములాఖత్‌ అయిన ఆరోపణలపై ఇప్పటికే సీఐడీ డీఎస్పీ విజయ్‌కుమార్‌ సస్పెండ్‌ కాగా మరికొందరి పాత్ర కూడా ఉండి ఉండొచ్చని ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. అసలు వాణిజ్యపన్నుల అధికారులను ప్రలోభపెట్టడం ద్వారానే ఈ కుంభకోణం జరిగినట్టు గుర్తించారు. పైగా, ఈ కుంభకోణం వెలుగుచూసిన తర్వాత దర్యాప్తు చేస్తున్న అధికారుల్లోనూ కొందరిని ప్రలోభపెట్టడం గమనార్హం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కేసు దర్యాప్తు మందకొడిగా సాగుతుండటంపై ఉన్నతాధికారులకు అనుమానం రావడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. 
 
ఏకంగా దర్యాప్తు అధికారినే లొంగదీసుకున్నట్లు తెలుసుకొని కంగుతిన్నారు. పోలీసులు విస్త్రతంగా గాలిస్తుండటంతో ఏదోఒకరోజు దొరక్క తప్పదని భావించిన సునీల్‌ తన పట్ల కఠినంగా వ్యవహరించకుండా చూస్తే చాలు కోరినంత డబ్బు ఇస్తానని రామలింగం ద్వారా బేరసారాలు సాగించాడు. అంతే తప్ప దర్యాప్తులో వెల్లడైన ఆధారాలు మాత్రం చెక్కు చెదరలేదని సీఐడీ ఉన్నతాధికారులు వెల్లడించారు.