గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 15 డిశెంబరు 2014 (13:19 IST)

నరబలి కోసం నన్ను కిడ్నాప్ చేశారు.. పోలీసులకు యువకుడి ఫిర్యాదు

నరబలి కోసం తనను కిడ్నాప్ చేశారని చిలకలగూడ పోలీసు స్టేషన్‌కు ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఘట్‌కేసర్‌లోని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లారని.. అక్కడ తనపై పసుపు, కుంకుమలు జల్లారని ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని, ఆ తర్వాత స్పృహ తెలిశాక అక్కడి నుంచి తప్పించుకుని వచ్చానని చెప్పారు. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పార్శిగుట్ట సంజీవనగర్‌కు చెందిన శివ (23) కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం 9 గంటల మధ్యన పార్సిగుట్టలో కేబుల్ రిపేర్‌కు వెళుతుండగా ఆటోలో వచ్చిన నలుగురు గుర్తుతెలియని ఆగంతకులు కేబుల్ రిపేరు ఉంది అటోలో రమ్మని అడిగారు. 
 
శివ పట్టించుకోకుండా ముందుకు నడుస్తుండగా ఆటోలో వచ్చిన నలుగురిలో ఒకరు మత్తుమందు కలిగిన కర్చ్ఫీను ముక్కు దగ్గర పెట్టడంతో సృహకోల్పోయాడు. అతడిని ఆటోలో ఘట్‌కేసర్ వరకు తీసుకెళ్లిన దుండగులు నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు. 
 
తర్వాత అతనిపై పసుపు, కుంకుమ చల్లారు. తర్వాత అతనికి పూర్తిగా స్పృహ తప్పడంతో ఏం జరిగిందో తెలియదు. స్పృహ వచ్చిన తర్వాత చూస్తే తాను ఎక్కడ ఉన్నది అర్థం కాలేదు. తనను ఎవరో కిడ్నాప్ చేశారని తెలుసుకుని అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
 
నిర్మానుష్య ప్రదేశంలో పడుకోబెట్టి కొందరు కోళ్లు, నిమ్మకాయలు వంటి సామాగ్రి కోసం వెళ్లినట్లు తెలిపిన పోలీసులు.. యువకుడు తప్పించుకోరాబట్టి సరిపోయిందని.. లేకుంటే ఆతనని బలిచ్చేవారని పోలీసులు చెప్పారు. ఇకపోతే.. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.