శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2016 (12:50 IST)

వైజాగ్ బయోమ్యాక్స్ కంపెనీలో అగ్నిప్రమాదం.. రూ.200 కోట్ల నష్టం

విశాఖపట్టణం జిల్లా గాజువాక మండలం దువ్వాడ సెజ్‌లోని బయోమ్యాక్స్ కంపెనీలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కంపెనీలోని ఆరు రీఫైనరీల్లో నిల్వచేసిన ముడిచమురు దగ్దమైంది. మిగిలిన ట్యాంకులకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. అయితే, ఈ అగ్నిప్రమాదం వల్ల రూ.200 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు అధికారులు చెపుతున్నారు.
 
ఈ 'బయోమ్యాక్స్‌ ఫ్యూయల్‌ లిమిటెడ్‌' కంపెనీలో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో, అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో మూడు వేల టన్నుల సామర్ధ్యం గల 16 బయోడీజిల్‌ ట్యాంకులకు మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగలు ఆప్రాంతం మొత్తం అలముకున్నాయి. మంటల కారణంగా 12 ట్యాంకులకు గాను ఆరు చమురు ట్యాంకులు దగ్ధమయ్యాయి. దీంతో ప్రమాద తీవ్రత మరింతగా పెరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దాదాపు 40 అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉన్నాయి.
 
అయినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. దీంతో హెలికాఫ్టర్ల ద్వారా పరిస్థితిని అంచనా వేస్తూ చర్యలు చేపట్టారు. అదేసమయంలో మిగిలిన ట్యాంకులకు మంటలు వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకున్నారు. అధికారులు ప్రమాద పరిస్థితిపై సీఎం చంద్రబాబుకు వివరించారు. కాగా ఈ ప్రమాదంలో ఏ విధమైన ప్రాణనష్టం జరగలేదు కదా, ఇద్దరు సిబ్బింది మాత్రం గాయపడినట్లు అధికారులు తెలిపారు.
 
ఈ ప్రమాదం కారణంగా స్థానికులు నిద్రలేని రాత్రిని గడిపారు. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాస్‌రావు, సీపీ అమిత్‌గార్గ్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. స్థానికులను సురక్షిత ప్రాంతానికి తరలించనున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.