గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Updated : మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (18:55 IST)

మీ పిల్లలను వైసీపీకి దూరంగా ఉంచండి... ఎవరు? ఎందుకు?

అమరావతి : అరాచక రాజకీయాలు చేస్తున్న వైఎస్ఆర్ సిపి కార్యాకలాపాల నుంచి తమ పిల్లలను దూరంగా ఉండేటట్లు చూడాలని తల్లిదండ్రులకు ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.డి.హిదాయత్ విజ్ఞప్తి చేశారు. ముస్ల

అమరావతి : అరాచక రాజకీయాలు చేస్తున్న వైఎస్ఆర్ సిపి కార్యాకలాపాల నుంచి తమ పిల్లలను దూరంగా ఉండేటట్లు చూడాలని తల్లిదండ్రులకు ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.డి.హిదాయత్ విజ్ఞప్తి చేశారు. ముస్లిముల సంక్షేమానికి టీడీపీ చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. అందుకే నారా హమారా... టీడీపీ హమారా కార్యక్రమాన్ని ముస్లిం సమాజం విజయవంతం చేసిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడారు. 
 
ఇటీవల గుంటూరులో నిర్వహించిన నారా హమారా... టీడీపీ హమారా కార్యక్రమం విజయవంతమైందన్నారు. రాష్ట్రంలోని ముస్లిం సమాజమంతా ఏకతాటిపై నిలబడి, టీడీపీ వెనకే ఉందనే విషయం ఈ సభతో రుజువైందన్నారు. ఒక రాజకీయ పార్టీ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ముస్లిములు ఎప్పుడూ హాజరు కాలేదన్నారు. 15 వేల మంది ముస్లిం మహిళలు బురఖాలు వేసుకుని, సభకు హాజరయ్యారన్నారు. వంద మంది కవులు, కళాకారులు కూడా పాల్గొన్నారన్నారు. ఎప్పుడూ దైవచింతనలో ఉండే ముఫ్తీలు కూడా సభకు హాజరై, 4 గంటలకుపైగా సాగిన వేదికపైనే ఉండి సీఎం చంద్రబాబునాయుడును ఆశీర్వదించారన్నారు. వారంతా 5,6 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ సభకు వచ్చారన్నారు. 
 
నారా హమారా...టీడీపీ హమారా సభ చారిత్రాత్మకమైందన్నారు. ఆ సభలో సీఎం చంద్రబాబునాయుడు రూ.1200 కోట్లకు పైగా వరాలను ముస్లిములపై కురిపించారన్నారు. మైనార్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారన్నారు. 4 ఏళ్లలో సీఎం చంద్రబాబునాయుడు ముస్లిముల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. ముస్లిముల నుంచి వచ్చిన స్పందన చూసి, వైఎస్ఆర్ సిపి నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. ముస్లిములను ఓటు బ్యాంకు వైసీపీ చూసిందని  ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.డి.హిదాయత్ మండిపడ్డారు. 
 
గుంటూరు సభను భగ్నం చేయడానికి వైసీపీ కుట్ర పన్నిందన్నారు. నేర చరిత్ర కలిగిన 8 మంది నంద్యాల యువకులను సభకు పంపించారన్నారు. సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడే సమయంలో నినాదాలు చేసి, సభను అడ్డుకోవాలని చూశారన్నారు. లక్ష మందికిపైగా హాజరైన టీడీపీ కార్యకర్తలు ఎంతో సమన్వయంతో వ్యవహరించి, వారిని అక్కడి నుంచి పంపించేశారన్నారు. అక్కడ ఏమైనా ఘర్షణ జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. గతంలో తునిలో కాపులు సభ జరుపుకుంటున్నప్పుడు, వైఎస్ఆర్ సిపి కార్యకర్తలే రైలును తగులబెట్టారని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.డి.హిదాయత్ ఆరోపించారు. 
 
జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇలాగే వ్యవహరించే వారన్నారు. హైదరాబాద్ మతకలాహాలు సృష్టించిన చరిత్ర వారిదన్నారు. వైఎస్ఆర్ సిపి అరాచక రాజకీయాలకు పాల్పడుతోందని చైర్మన్ హిదాయత్ మండిపడ్డారు. ఆ పార్టీ కార్యకలాపాలకు, సభకు తమ పిల్లలను దూరంగా పెట్టాలని తల్లిదండ్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు. నారా హమారా... టీడీపీ హమారా సభలో వైసీపీ కార్యకర్తలు చేసిన నినాదాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని జగన ను ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతమయ్యాయన్నారు. సీఎం చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తరవాత వక్ఫ్ బోర్డుకు చెందిన భూముల్లో ఒక్క అంగుళం కూడా కబ్జాకు గురికాలేదన్నారు. 
 
కాంగ్రెస్ హయాంలో అన్యాక్రాంతమైన భూముల్లో 5 వేల ఎకరాలు తిరిగి స్వాధీనం చేసుకుని, వక్ఫ్ బోర్డుకు అప్పగించారన్నారు. వాస్తవం ఇలా ఉంటే టీడీపీ హయాంలో వక్ఫ్ బోర్డు భూములు కబ్జాకు గురి అయ్యాయనడం సరికాదన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఉర్దూ భాష నిరాదరణకు గురైందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఉర్దూ అకాడమీ కమిటీ చేశారన్నారు. పదవుల పంపకంలో ముస్లిములకు సీఎం చంద్రబాబునాయుడు పెద్దపీట వేశారన్నారు. ఆరుగురు కార్పొరేషన్ల చైర్మన్లను, ఇద్దరు మేయర్లను, జెడ్పీ చైర్మన్లను ప్రభుత్వి విప్, శాసనమండలి చైర్మన్ గా ముస్లిములకు అవకాశమిచ్చారన్నారు. వైసీపీ నేతలకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. 
 
ముస్లిం యువతను బలిపశువు చేయడానికి వైసీసీ నేతలు కుట్ర పన్నుతున్నారన్నారు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేగా ముస్లిం సామాజిక వర్గానికే చెందిన వారే ఉన్నారని, ఆయనే నేరుగా గుంటూరు సభకు వచ్చి మాట్లాడాలని చూస్తే తాము వీఐపీ పాస్ ఇచ్చే వారమని అన్నారు. వైసీసీ నేతలు నేరుగా వచ్చి సీఎం చంద్రబాబునాయుడుతో ప్రశ్నిస్తామంటే అవకాశమిచ్చేవారమన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ నుంచి పారిపోయిన వారికి సభలో మాట్లాడే దమ్ము ఎక్కడుందన్నారు. సభను అడ్డుకోవాలనేదే వైసీపీ ఉద్దేశమన్నారు.